‘అద్భుతం’ చిత్రం ఫాంటసీ లవ్స్టోరీగా తెలుగు ప్రేక్షకులకు నవ్యానుభూతిని పంచుతుందని అన్నారు మల్లిక్రామ్. ఆయన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తేజ సజ్జా, శివానీ రాజశేఖర్ జంటగా నటించారు. ఈ నెల 19న డిస్నీ ప్లస్హాట్స్టార్ ద్వారా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానున్నది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్లో మల్లిక్రామ్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ఆర్కిటెక్చర్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశా. దర్శకుడు కావాలనే లక్ష్యంతో ఇండస్ట్రీలోకి వచ్చా. గోల్కొండహైస్కూల్, ఊహలు గుసగుసలాడేతో పాటు పలు సినిమాలకు దర్శకత్వశాఖలో పనిచేశా. ‘నరుడా డోనరుడా’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యా. ‘పెళ్లిగోల’, ‘తరగతిగది దాటి’ అనే వెబ్సిరీస్లు చేశా. దర్శకుడిగా నా రెండో సినిమా ఇది. ప్రశాంత్వర్మ చెప్పిన కథతో ఈ సినిమా చేశా. ఒకే ఫోన్ నంబర్ కలిగిన ఓ జంట కథ ఇది. వారి మధ్య ఉన్న సంబంధమేమిటన్నది థ్రిల్ను కలిగిస్తుంది. అంతులేని బాధను మనసులో పెట్టుకొని బతికే యువకుడిగా తేజ సజ్జా, చలాకీ అమ్మాయిగా శివానీ కనిపిస్తారు. ట్రైలర్ చూసి చాలా మంది ‘ప్లేబ్యాక్’ సినిమాతో పోల్చుతున్నారు. జోనర్ ఒకటే అయినా మా కథ పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇప్పటివరకు రీమేక్ కథలతోనే సినిమాలు, సిరీస్లు చేశా. రీమేక్ల దర్శకుడు అనే ముద్రకు దూరంగా ఉంటూ సొంత కథలతోనే సినిమాలు చేస్తా. ‘తరగతి గది దాటి’ రెండో సీజన్ను తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నా’ అని తెలిపారు.