‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకొని భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని విశ్వవేదికపై ఘనంగా చాటింది. దేశానికి తొలి ఆస్కార్ను అందించిన చిత్రంగా ‘ఆర్ఆర్ఆర్’ చరిత్ర సృష్టించింది. తాజాగా ఈ సినిమా బృందం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మక ఆస్కార్ కమిటీలో సభ్యులుగా ఉండేందుకు హీరోలు రామ్చరణ్, ఎన్టీఆర్, సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్, ఛాయాగ్రాహకుడు సెంథిల్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్లకు ఆహ్వానాలు అందాయి.
ఈ ఏడాది 398 మందికి కొత్తగా ఆస్కార్ ప్యానెల్లో చోటు కల్పించబోతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ నుంచి పదకొండు మంది సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. ‘ఆర్ఆర్ఆర్’ బృందంతో పాటు ప్రముఖ దర్శకులు మణిరత్నం, కరణ్జోహార్, సిద్ధార్థ్ రాయ్ కపూర్, చైతన్య తమహానే, షానెక్ సేన్లు కూడా ఆస్కార్ కమిటీ నుంచి ఆహ్వానాల్ని అందుకున్నారు. రాబోవు ఆస్కార్ అవార్డుల ఎంపికలో వీరందరికి ఓటు హక్కు ఉంటుంది. ఆస్కార్ కమిటీ ఆహ్వానాన్ని అందుకున్న తొలి తెలుగు హీరోలుగా ఎన్టీఆర్, రామ్చరణ్ అరుదైన ఖ్యాతిని దక్కించుకున్నారు.