ఆంధ్రప్రదేశ్ కుప్పంలో గుండెపోటుతో తీవ్ర అనారోగ్యానికి గురైన నటుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం శనివారం తెల్లవారుఝామున తారకరత్నను బెంగళూరులోని ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు.
తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బెంగళూరు ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆయనకు తీవ్రమైన గుండెపోటు రావడం వల్ల కార్డియో జెనిక్ షాక్కు గురయ్యారని, తారకరత్న పరిస్థితిని నిత్యం పరిశీలిస్తూ మెరుగైన వైద్యం అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఏపీలో చేపట్టిన యువగళం కార్యక్రమంలో పాల్గొన్న తారకరత్న ఈ కార్యక్రమం కొనసాగుతుండగానే గుండెపోటుతో కుప్పకూలిపోయారు.