Manikyam Narayanan | గత కొన్నేళ్లుగా కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు అజిత్ కుమార్. వివాదాలకు అతీతంగా, ఎక్కడ హడావిడీ చేయకుండా కనిపిస్తుంటాడు. ఆన్ స్క్రీన్లో తప్పితే.. ఆఫ్ స్క్రీన్లో ఆయన కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. షూటింగ్లు, ఫ్యామిలీ, బైక్ రేసింగ్ ఇవి తప్పితే అజిత్కు వేరే లోకమే లేదు. సినిమా ప్రమోషన్లలో కూడా ఆయన ఎక్కువగా కనిపించడు. అలాంటి అజిత్పైన తమిళంలో ఒకప్పుడు స్టార్ ప్రొడ్యూసర్గా పేరు తెచ్చుకున్న మాణిక్యం నారాయణన్ సంచలన ఆరోపణలు చేశాడు.
అజిత్ అందరూ అనుకున్నట్లుగా జెంటిల్ మ్యాన్ కాదని, తనని మోసం చేశాడని ఆ సీనియర్ ప్రొడ్యూసర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా చెన్నైలో జరిగిన ఓ ప్రెస్మీట్లో నారాయణన్ ఈ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ తమిళ సినీ వర్గాల్లో పెద్ద చర్చనీయంశమైంది. గతంలో అజిత్ తన తల్లిదండ్రులను మలేషియా పంపడానికి తన వద్ద కొంత డబ్బు తీసుకున్నాడని.. దానికి బదులుగా సినిమా చేస్తానని మాటిచ్చినట్లు నారాయణన్ తెలిపాడు. తానిచ్చిన ఆ డబ్బును రెమ్యునరేషన్గా సర్దుబాటు చేసుకోవాలని అనుకున్నామని, కానీ అజిత్ తనతో ఇప్పటివరకు సినిమా చేయలేదని, డబ్బులు కూడా తిరిగి చెల్లించలేదని ఆయన వెల్లడించాడు.
ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా దాని గురించి అజిత్ మాట్లాడలేదని, తనను తాను జెంటిల్ మ్యాన్ అనుకుంటున్నాడని కానీ అతను జెంటిల్ మ్యాన్ కాదని ఆయన అన్నాడు. యాభై కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే అజిత్కు ఇతరులను మోసం చేయాల్సిన అవసరమేంటి అంటూ మాణిక్యం నారాయణన్ ఆరోపణలు చేశాడు. దీనిపై పలువురు కావాలనే మాణిక్యం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడని.. తనపై అటెన్షన్ కోసం, వార్తల్లో నిలిచేందుకు ఇలాంటి పిచ్చి ఆరోపణలు చేస్తున్నాడనే విమర్శలు చేస్తున్నారు. కాగా గతంలోనే షారుఖ్తో అట్లీ చేస్తున్న జవాన్ కథ.. తను నిర్మించిన పేరరసుకు కాపీ అంటూ ఆ మధ్య కోర్టుకు ఎక్కి హాట్ టాపిక్ అయ్యాడు మాణిక్యం నారాయణ్.