Tamil Producers Association | సినీ ఇండస్ట్రీలో కొన్ని సార్లు హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలు అనుకోకుండా నిలిచిపోవడం చూస్తూనే ఉంటాం. సినిమాలు ఆగిపోవడానికి కారణాలేంటనేది పక్కన పెడితే.. నిర్మాతలు మాత్రం భారాన్ని మోయాల్సి వస్తుంది. ఇప్పుడలాంటి పరిస్థితే తమిళనాట నెలకొందని తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్న ఓ వార్త చెబుతోంది. ఇంతకీ విషయమేంటంటే.. తమిళ నిర్మాతల అసోసియేషన్ నలుగురు హీరోలకు రెడ్ కార్డ్ జారీ చేయాలని ఫిక్సయిందట.
ఆ హీరోలెవరనే కదా మీ డౌటు. స్టార్ యాక్టర్లు ధనుష్ (Dhanush), శింబు, విశాల్(Vishal), అథర్వ. ఈ నలుగురు హీరోల ప్రవర్తనపై విసుగుచెందిన నిర్మాతలు వారికి రెడ్ కార్డ్ జారీ చేయాలనుకుంటున్నట్టు కోలీవుడ్ సర్కిల్ టాక్. ధనుష్ శ్రీ థెనాండల్ ఫిలిమ్స్ బ్యానర్లో ఓ సినిమా డైరెక్ట్ చేయాల్సి ఉండగా.. చాలా కాలంగా పెండింగ్లో పడిపోవడంతో నిర్మాణ సంస్థకు తీవ్ర నష్టం వాటిల్లిందట.
ఇక శింబు (Simbu) మైఖేల్ రాయప్పన్ నిర్మాణంలో Anbavan Asaradhavan Adangadhavan సినిమాకు సైన్ చేసి మధ్యలో ఆపేయడంతో నష్టాలు మూటగట్టుకున్నారు నిర్మాత. మరోవైపు అసోసియేషన్ డబ్బులను దుర్వినియోగం చేశారని విశాల్పై ఆరోపణలున్నాయి. హీరో అథర్వ (Atharva) పై నిర్మాత Mathiyazhagan 2019లో ఓ ఫిర్యాదు చేశారు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్గా నిలిచింది. దీంతో అథర్వ సదరు నిర్మాతతో మరో సినిమా చేస్తానని చెప్పి.. మాట తప్పడంతో ఫిర్యాదు నమోదైంది.
ఇలా ఒక్కో హీరోతో ఒక్కోలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిర్మాతలు తీసుకోబోయే చర్యలపై సదరు హీరోలు ఎలా రియాక్ట్ అవుతారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.