సినిమా కళాత్మక వ్యాపారం. ఇక్కడ తారలు తమ ఇమేజ్ను బట్టి పారితోషాకాల్ని డిమాండ్ చేస్తుంటారు. ఇక అగ్ర తారలైతే రెమ్యునరేషన్ విషయంలో ఏమాత్రం రాజీపడరు. కానీ ఈ ధోరణికి భిన్నంగా అగ్ర కథానాయిక తమన్నా ‘ఓ రోమియో’ అనే హిందీ సినిమాలో అతిథి పాత్రలో నటించినందుకుగాను ఎలాంటి పారితోషికాన్ని తీసుకోలేదట. ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్లో హాట్టాపిక్గా మారింది. షాహిద్కపూర్, త్రిప్తి డిమ్రి జంటగా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్కు విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించారు. ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రచార కార్యక్రమాల సందర్భంగా దర్శకుడు విశాల్ భరద్వాజ్ రెమ్యునరేషన్ల అంశం గురించి మాట్లాడారు.
కథానాయిక తమన్నా, ‘12th ఫెయిల్’ ఫేమ్ విక్రాంత్ మస్సే ఈ సినిమాలో అతిథి పాత్రల్లో నటించారని, తనతో ఉన్న స్నేహసంబంధాలతో పాటు ఓ మంచి కథకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో వారిద్దరూ పైసా పారితోషికాన్ని తీసుకోకుండానే నటించారని, ఈ రోజుల్లో అంతటి ఉదార స్వభావం ఉన్న వారు అరుదని ప్రశంసించారు. గెస్ట్రోల్ కోసం కొన్ని రోజులే కేటాయించినా.. ఇప్పుడున్న వ్యాపార దృక్కోణంలో ఉచితంగా నటించడం గొప్ప విషయమని బాలీవుడ్ వర్గాలంటున్నాయి. గత ఏడాది వచ్చిన ‘ఓదెల-2’ తర్వాత తెలుగులో తమన్నా మరే చిత్రానికి సైన్ చేయలేదు.