అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల సాధనకు ప్రభుత్వం అన్ని విధాలా సానుకూలంగా స్పందించిందన్నారు. ఈనెలాఖరు వరకు సమస్యలు పరిష్కారమై జీవోలు విడుదల అవుతాయని చిరంజీవి వెల్లడించారు. ఈరోజు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రి పేర్ని నానితో చిరంజీవి, మహేశ్బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణ మురళి, అలీ, ఆర్. నారాయణమూర్తి, నిర్మాత నిరంజన్రెడ్డి , ఇతర సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
చిన్న సినిమాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, రాష్ట్రంలో ఐదో షోకు అంగీకరించడం శుభపరిణామని పేర్కొన్నారు. వైజాగ్లో పెద్ద ఎత్తున షూటింగ్లు చేపట్టాలని సీఎం కోరడం అందుకు ప్రభుత్వం అనుకూల వాతావరణం కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు .
సీఎంతో జరిగిన చర్చలు సంతృప్తికరంగా జరిగాయని వెల్లడించారు. ఇండస్ట్రీ సమస్యలకు శుభం కార్డు పడిందని చెప్పడానికి సంతోషిస్తున్నామని చిరంజీవి పేర్కొన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు రావడాన్ని సీఎం జగన్ అభినందించారని చెప్పారు. పెద్ద సినిమాల ప్రదర్శనలపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.