Taapsee Pannu | అగ్ర కథానాయిక తాప్సీ ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. చిరకాల స్నేహితుడు, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథియస్ బోతో ఈ భామ మార్చి 23న పెళ్లిపీటలెక్కింది. కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో అత్యంత గోప్యంగా ఈ వివాహం జరిగింది. పెళ్లి తాలూకు ఫొటోలు కూడా బయటకు రాలేదు. ఇండస్ట్రీకి చెందిన తాప్సీ సన్నిహిత మిత్రులు తమ సోషల్మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసిన ఫొటోల ద్వారా పెళ్లి విషయం బయటకు వచ్చింది.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వివాహం గురించి స్పందించింది తాప్సీ. పెళ్లి గురించి అందరూ చర్చించుకోవడం తనకు ఇష్టం లేదని, అందుకే అనవసర ఆర్భాటాలకు దూరంగా నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నానని తెలిపింది. ఆమె మాట్లాడుతూ ‘నా కుటుంబం, సన్నిహితుల అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నా. నా పెళ్లి గురించి ప్రపంచం మొత్తానికి తెలియాల్సిన అవసరం లేదనిపించింది. అంత మాత్రాన ఎప్పటికీ రహస్యంగా ఉంచాలనుకోవడం లేదు. ప్రస్తుతానికైతే నా పెళ్లి ఫొటోలను షేర్ చేసే ఆలోచన లేదు. భవిష్యత్తులో నా అభిప్రాయం మారితే అప్పుడు ఫొటోలను పంచుకుంటాను’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ భామ హిందీలో ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా’ చిత్రంలో నటిస్తున్నది.