కెరీర్ ఆరంభంలో గ్లామర్ పాత్రల్లో అలరించిన పంజాబీ సుందరి తాప్సీ ప్రస్తుతం వాటికి పూర్తిగా స్వస్తి పలికింది. విభిన్న కథాంశాలు, ప్రయోగాత్మక పాత్రల్ని ఎంచుకుంటూ బాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక పంథాను సృష్టించుకుంది. మహిళా ప్రధాన చిత్రాలకు ఈ అమ్మడు కేరాఫ్ అడ్రస్గా మారింది. కెరీర్ తొలినాళ్లలో అందం, విజయం తాలూకు అంశాల పట్ల తన దృక్పథం వేరుగా ఉండేదని..ఈ ప్రయాణంలో పరిణితి సాధించానని తాప్సీ పేర్కొంది. ఆమె మాట్లాడుతూ ‘తొలిరోజుల్లో అందంగా కనిపించాలని తాపత్రయపడేదాన్ని. గ్లామర్ హంగులతో ఆకట్టుకుంటే అభిమానగణం పెరుగుతుందని, పెద్ద సినిమాల వల్ల మాత్రమే గుర్తింపు వస్తుందనే భ్రమలో విహరించేదాన్ని. అయితే కాలక్రమంలో నా ఆలోచనలు తప్పని అర్థం చేసుకున్నా. అందరు నడిచే దారిలో ప్రయాణం ఎప్పుడూ కొత్తగా ఉండదని తెలుసుకున్నా. కంఫర్ట్జోన్ నుంచి బయటపడి ఆలోచిస్తేనే మనకంటూ ఓ గుర్తింపు లభిస్తుందని అర్థమైంది. కేవలం హీరోయిన్లా మాత్రమే కాకుండా నటిగా నిరూపించుకోవాలనుకున్నా. అక్కడి నుంచే విజయాలు వరించడం మొదలైంది’ అని తాప్సీ చెప్పింది. ప్రస్తుతం ఆమె హిందీలో ‘శభాష్ మిత్తు’ చిత్రంలో నటిస్తున్నది.