కోలీవుడ్ స్టార్ కపుల్ విఘ్నేష్ శివన్, నయనతార ఇటీవలే సరోగసీ (Nayanthara-Vignesh Shivan surrogacy) ద్వారా ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే సరోగసీ అంశంపై అనుమానాలుండటంతో కొంతమంది ఈ విషయాన్ని నెగెటివ్గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నయనతార-విఘ్నేశ్ శివన్ సరోగసీ వ్యవహారం చట్టబద్ధంగా జరిగిందా..? లేదా..? అని దానిపై తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణకు నలుగురు సభ్యుల ప్యానెల్ కూడా ఏర్పాటు చేసింది.
అయితే నేషనల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. ఆస్పత్రి యాజమాన్యం సరోగసీ నిబంధనలను ఉల్లంఘించినట్టుగా ప్యానెల్ గుర్తించినట్టు తెలుస్తోంది. నయనతార సరోగసీ విషయంలో ఆస్పత్రి సిబ్బంది వివరణలు సంతృప్తికరంగా లేవని, ఆస్పత్రి యంత్రాంగం చట్టపరమైన చర్యలను కూడా ఎదుర్కోవలసి ఉంటుందని ఆరోగ్య మంత్రి ఎంఏ సుబ్రమణియన్ (MA subramanian )మీడియాతో అన్నారు. ఇప్పటికే నయనతార-విఘ్నేష్ శివన్ సరైన విధి విధానాలు, నియమ నిబంధలను పాటించారా..? లేదా..? అనే దానిపై ప్రభుత్వం విచారణ జరిపింది. ప్యానెల్ నివేదికను త్వరలో వెల్లడించనున్నట్టు తెలిపారు.
నివేదిక సమర్పించిన ప్యానెల్ ..
ఇద్దరు పీడియాట్రిక్ డాక్టర్ల నేతృత్వంలోని ప్యానెల్ ఈ రోజు ఆరోగ్య శాఖకు నివేదిక సమర్పించినట్టు సమాచారం. నయనతార -విఘ్నేష్ శివన్ మార్చి 11, 2016న చట్టబద్ధంగా వివాహం చేసుకున్నారని నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. నయనతార-విఘ్నేష్ శివన్ సరోగసీ విధి విధానాలు, మార్గదర్శకాలను ఫాలో అయినట్టు నివేదికలో పేర్కొన్నట్టు కథనాల సారాంశం.
కాగా మంత్రి ఎంఏ సుబ్రమణియన్ మీడియాతో ఏ విషయాలు వెల్లడిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.విచారణ విషయం అటుంచితే.. సరోగసి పద్ధతిలో అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందిన విఘ్నేష్ శివన్-నయనతార దంపతులు మాత్రం తమ సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇండియాలో సరోగసిపై నిషేధం ఉన్న విషయం తెలిసిందే. జనవరి 2022 నుంచి అద్దె గర్భం మోయాలి అంటే దానికి ఖచ్చితమైన కారణాలు ఉండాలి.. అత్యవసరమైతే తప్ప సరోగసి వైపు వెళ్ళకూడదని చట్టాలు పేర్కొంటున్నాయి.