Suriya | తమిళ స్టార్ హీరోలు సూర్య,కార్తీ అన్నదమ్ములుగా మాత్రమే కాదు, సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కూడా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ ఇద్దరికీ మంచి మార్కెట్ ఉంది. వీరి సినిమాలు తెలుగు ప్రేక్షకుల దగ్గర కూడా మంచి ఆదరణ పొందుతుంటాయి. ప్రస్తుతం సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘కరుప్పు’ తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మూవీ టీమ్ హైదరాబాద్లో గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సూర్యతో పాటు ఆయన తమ్ముడు కార్తీ కూడా ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. ఒకే వేదికపై అన్నదమ్ములు కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.
ఈ ఈవెంట్లో యాంకర్ సుమ కనకాల అడిగిన సరదా ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ సూర్య తన చిన్ననాటి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. చిన్నప్పుడు తాను, కార్తీ కలిసి చేసిన ఓ అల్లరి పని గురించి చెప్పి అందరినీ నవ్వుల్లో ముంచెత్తాడు. “మేము చిన్నప్పుడు నటుడు నూతన్ ప్రసాద్ గారి ఇంటి పక్కనే ఉండేవాళ్లం. వాళ్లింట్లో పెద్ద మామిడికాయ చెట్టు ఉండేది. మా ఇంటి సన్షేడ్ ఎక్కి వాళ్ల ఇంట్లోకి దూకి మామిడికాయలు దొంగతనం చేసేవాళ్లం. నేను పైకి ఎక్కేందుకు కార్తీ సహాయం చేసేవాడు. మామిడికాయలు తెచ్చాక వాటి కోసం ఇద్దరం మళ్లీ కొట్టుకునేవాళ్లం” అంటూ సూర్య చెప్పిన మాటలు ఈవెంట్లో నవ్వులు పూయించాయి.
సూర్య చెప్పిన ఈ చిన్ననాటి సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య ఉన్న బాండింగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఒకవైపు స్టార్ హీరోలుగా బిజీగా ఉన్నా, మరోవైపు చిన్ననాటి జ్ఞాపకాలను ఇంత సరదాగా పంచుకోవడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక ‘వీరభద్రుడు’ విషయానికి వస్తే, దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. హీరోయిన్గా త్రిష కృష్ణన్ నటిస్తుండగా, భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.