ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులను ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుందని, తెలుగు రాష్ర్టాల్లో ఇటీవల సంభవించిన వరదల వల్ల ఎంతో మంది నిరాశ్రయులయ్యారని, వారికి సహాయం చేసేందుకు టాలీవుడ్ కలిసికట్టుగా ముందుకెళ్తుందని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది.
గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఛాంబర్ గౌరవ కార్యదర్శి దామోదరప్రసాద్ మాట్లాడుతూ ‘ఫిల్మ్ ఛాంబర్ తరపున రెండు రాష్ర్టాల సీఎం రిలీఫ్ ఫండ్స్కు 25 లక్షల చొప్పున 50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నాం. ఫిల్మ్ ఫ్రొడ్యూసర్స్ తరపున ఉభయ రాష్ర్టాలకు చెరో పది లక్షలు అందజేస్తాం’ అన్నారు.
తమ కుటుంబం నుంచి రెండు రాష్ర్టాలకు కలిపి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటిస్తున్నామని నిర్మాత దగ్గుబాటి సురేష్బాబు తెలిపారు. తమ నిర్మాణ సంస్థ నుంచి రెండు రాష్ర్టాలకు చెరో 25 లక్షలు ఇవ్వబోతున్నట్లు నిర్మాత దిల్రాజు పేర్కొన్నారు. నేడు అన్ని యూనియన్లతో సమావేశం నిర్వహించి ఒకరోజు వేతనం ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నామని ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ చెప్పారు.