Ramayan Serial | ‘రామాయణం’. హిందువులు అత్యంత ఇష్టపడే, గౌరవించే భారతీయ పురాతన పౌరాణిక కథ. అయితే ఈ ‘రామాయణం’ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే పేరు ‘రామాయణం’ సీరియల్. రామానంద్ సాగర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సీరియల్ ఒకప్పుడు యావత్ దేశాన్ని భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. 1987-88లో దూర్దర్శన్లో ప్రతి ఆదివారం ఈ సీరియల్ ప్రసారమయ్యేది. ఇక సీరియల్ వచ్చే సమయంలో రోడ్లపై నిశ్శబ్దం అలుముకునేది. దాదాపు ప్రతి ఇంట్లో సీరియల్లోని పాత్రలపై చర్చలు జరిగేవంటే ఎంత ప్రజాధరణ పొందిందో తెలుసుకోవచ్చు. ఈ సీరియల్లో రాముడిగా అరుణ్ గోవిల్(Arun govil), సీతగా దీపిక చిక్లియా(Deepika Chikliya), లక్ష్మణుడిగా సునీల్ లాహ్రీ(Sunil Lahri) నటించారు.
అయితే, అయోధ్యలో వచ్చే ఏడాది శ్రీరామ మందిర ప్రారంభోత్సవం (Ayodhya Ram temple inauguration) నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ వేడుకకు తనకు ఆహ్వానం అందలేదని లక్ష్మణుడిగా నటించిన సునీల్ లాహ్రీ తాజాగా పేర్కొన్నారు. రాముడిగా, సీతగా చేసిన అరుణ్ గోవిల్, దీపికకు ఆహ్వానపత్రికలు అందాయని, తనకు మాత్రం ఆహ్వానం అందకపోవడం కాస్త నిరాశ కలిగించిందని తెలిపారు. ఇక ఆహ్వానం అందకపోవడంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రామాయణ్లో తన క్యారెక్టర్(లక్ష్మణుడి)కు అంత ప్రాధాన్యం లేదని ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వాహకులు భావించి ఉండొచ్చని వెల్లడించాడు.