‘పుష్ప’ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో మెప్పించారు సునీల్. ఆ సినిమా తర్వాత తన పంథా మార్చుకొని విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటున్నారు. ఇటీవల విడుదలైన ‘జపాన్’ చిత్రంలో కూడా సునీల్ సరికొత్త క్యారెక్టర్లో కనిపించారు. తాజా సమాచారం ప్రకారం అగ్ర హీరో చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’లో (టైటిల్ పరిశీలనలో ఉంది) సునీల్ కీలకమైన పాత్రలో కనిపించనున్నారని తెలిసింది.
చిరంజీవి నటించిన ఇంద్ర, స్టాలిన్, అందరివాడు, జై చిరంజీవా, గాడ్ ఫాదర్ వంటి చిత్రాల్లో సునీల్ కీలకమైన పాత్రల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ఈ సెంటిమెంట్ దృష్ట్యా ‘విశ్వంభర’ చిత్రంలో కూడా సునీల్ కోసం దర్శకుడు వశిష్ట మంచి పాత్రను డిజైన్ చేశారని చెబుతున్నారు. సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కబోతున్న ‘విశ్వంభర’ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 25 నుంచి హైదరాబాద్లో మొదలుకానుంది. యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నది.