తెలుగు సినీరంగంలో గత కొంతకాలంగా పర్సంటేజీ విధానంపై డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి ఏషియన్ మూవీస్ అధినేత, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తానీ నిర్ణయాన్ని తీసుకున్నానని ఆయన పేర్కొన్నారు. ఈమెయిల్ ద్వారా ఆయన ఛాంబర్కు రాజీనామా లేఖను పంపించారు. ‘కొందరు కార్యవర్గ సభ్యులను మెప్పించేలా నిర్ణయాలు తీసుకోవాలని నాపై ఒత్తిడి తెస్తున్నారు.
ఇకపై నేను ఆ విధంగా చేయలేను. అలాగే నాకు ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. ప్రతి నిర్ణయంలో ఛాంబర్ ఏకాభిప్రాయంతో నడచుకోవాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలా జరగడం లేదు’ అని రాజీనామా లేఖలో సునీల్ నారంగ్ పేర్కొన్నారు. ఆయన రాజీనామాను ఫిల్మ్ ఛాంబర్ ఆమోదించింది. పర్సంటేజీ విధానంపై నడుస్తున్న తీవ్ర చర్చలు, ఈ నేపథ్యంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల వల్లే సునీల్ నారంగ్ రాజీనామా చేశారని అంటున్నారు. పర్సంటేజీ సమస్యను పరిష్కరించడానికి ఈమధ్యే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఓ సబ్కమిటీని నియమించింది. రెండు నెలల్లో ఈ కమిటీ నివేదికను సమర్పించనుంది.