‘నా కెరీర్లో ఇదొక ప్రత్యేక చిత్రం. ప్రతిభావంతులైన నటీనటుల కలయికలో తెరకెక్కింది. యూనివర్సల్ కథాంశమిది. ప్రతి ఒక్కరికి చేరువవుతుంది’ అన్నారు సందీప్కిషన్. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘మైఖేల్’. విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్కుమార్, దివ్యాంశ కౌశిక్, వరుణ్సందేశ్, గౌతమ్ మీనన్ ప్రధాన పాత్రల్ని పోషించారు. రంజిత్ జయకోడి దర్శకుడు. భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మాతలు. ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకురానుంది.
శనివారం నిర్వహించిన సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ సినిమాలో యాక్షన్, రొమాన్స్, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. సాంకేతికంగా కూడా ఉన్నతంగా ఉంటుంది. సరికొత్త గ్యాంగ్స్టర్ డ్రామాగా ఆకట్టుకుంటుంది’ అన్నారు. ‘ఈ సినిమాలో విజయ్ సేతుపతి, గౌతమ్మీనన్ వంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నారు. ట్రైలర్, పాటలకు వచ్చిన ఆదరణ సినిమాపై మరింత నమ్మకాన్ని పెంచింది. ఖచ్చితంగా హిట్ కొట్టబోతున్నాం’ అని నిర్మాత భరత్ చౌదరి చెప్పారు. కథ నచ్చి వెంటనే సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టామని పుస్కూర్ రామ్మోహన్ రావు తెలిపారు. ‘మైఖేల్’ వంటి విభిన్న కథలో భాగం కావడం ఆనందంగా ఉందని వరుణ్ సందేశ్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కిరణ్ కౌశిక్, సంగీతం: సామ్ సీఎస్, సంభాషణలు: త్రిపురనేని కల్యాణ్ చక్రవర్తి, రాజన్ రాధామణలన్, రంజిత్ జయకోడి.