‘సుమ మీదున్న అభిమానంతో నేనీ వేడుకకు వచ్చాను. ఇక్కడ పండగలాంటి వాతావరణం కనిపిస్తున్నది. తప్పకుండా ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది’ అని అన్నారు అగ్రహీరో అక్కినేని నాగార్జున. శనివారం హైదరాబాద్లో జరిగిన ‘జయమ్మ పంచాయితీ’ ప్రీరిలీజ్ వేడుకకు ఆయనతో పాటు హీరో నాని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విజయ్కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించారు. నాని మాట్లాడుతూ ‘సుమ మనందరి ఇంటి మనిషిగా మారారు. ట్రైలర్ చూశాక తను వెండితెరపై కూడా సక్సెస్ అవుతుందనిపించింది’ అని అన్నారు. సుమ మాట్లాడుతూ ‘తెలుగువారందరూ తమ ఇంటి అమ్మాయిగా భావించడం వల్లే నేనీ స్థాయికి వచ్చాను. మీ చప్పట్లే నాకు బలాన్నిస్తున్నాయి. ఈ సినిమా ప్రమోషన్కు రామ్చరణ్, నాని, నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, పవన్కల్యాణ్ వంటి స్టార్స్ సహరించారు. అందరి హీరోల అభిమానులు ఈ సినిమాను చూస్తారని భావిస్తున్నా. ఈ నెల 3న మహేష్బాబుగారు కొత్త ట్రైలర్ను విడుదల చేస్తున్నారు’ అని చెప్పింది. సినిమాలో సుమ అద్భుతమైన నటనను కనబరచిందని, కీరవాణి సంగీతం ప్రధానాకర్షణగా నిలుస్తుందని చిత్ర దర్శకుడు విజయ్ కుమార్ తెలిపారు. అందం, తెలివితేటలతో పాటు మంచి మనసున్న సుమ నటించిన ఈ సినిమా విజయవంతం కావాలని సంగీత దర్శకుడు కీరవాణి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చంద్రబోస్, సుడిగాలి సుధీర్, యాంకర్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.