సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మామా మశ్చీంద్ర’. మృణాలినీ రవి, ఈషా రెబ్బా నాయికలుగా నటిస్తున్నారు. హర్షవర్థన్ దర్శకుడు. సృష్టి సెల్యూలాయిడ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ పతాకంపై సునీల్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. సోనాలీ నారంగ్, సృష్టి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో సుధీర్ బాబు దుర్గా, పరశురామ్, డీజే అనే మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు. శనివారం ఈ చిత్ర టీజర్ను స్టార్ హీరో మహేశ్ బాబు విడుదల చేశారు. టీజర్ చూస్తే..దుర్గ తన జీవితంలో ఒక ప్రేయసి కావాలనుకుంటాడు. డీజేకు అమ్మాయిలంటే పడదు. ఈ ఇద్దరినీ చంపాలని ప్రయత్నిస్తాడు డాన్ పరశురామ్. ఈ మూడు పాత్రలతో యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు.