సినిమాకు కథే ముఖ్యమనే విషయం అందరూ అంగీకరించేదే. కథను స్టార్స్ ప్రభావితం చేస్తారనే అభిప్రాయం ఉన్నా…ఉన్న కథను మరో స్థాయికి తీసుకెళ్లేందుకే స్టార్ డమ్ ఉపయోగపడుతుందనేది నిజం. బాలీవుడ్ వర్సెస్ సౌత్ మూవీస్ అనే చర్చ జోరుగా జరగుతున్న సమయమిది. కాబట్టి కథా, హీరోనా అనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ విషయంపై తన అభిప్రాయం తెలియజేశారు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి. కంటెంట్ ఈజ్ కింగ్ అన్నది ఆయన మాట.
తాజాగా సునీల్ శెట్టి మాట్లాడుతూ…‘సినిమా ద్వారా ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు అనేది మనం మర్చిపోయాం. బాలీవుడ్ దర్శక నిర్మాతలు, హీరోలు తమకు నచ్చిన సినిమాలు చేసుకుంటున్నారు. ఒక సినిమా చూడాలా వద్దా అనేది ప్రేక్షకుడు నిర్ణయించుకుంటాడు. అంతిమంగా కథే హీరో. హీరోలు వస్తారు పోతారు సినిమా శాశ్వతంగా మిగిలి ఉంటుంది’ అన్నారు. అప్పట్లో మంచు విష్ణు ‘మోసగాళ్లు’ చిత్రంలో నటించిన సునీల్ శెట్టి, ఈ మధ్య వరుణ్ తేజ్ ‘గని’ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. హిందీలో సీజనల్ యాక్టర్గా ఆయన కెరీర్ కొనసాగుతున్నది.