సినిమా, థియేటర్ల వ్యవస్థపై లక్షలాది మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఈ రంగాలను అణచివేస్తూ వారందరికి జీవనోపాధి లేకుండా చేయొద్దని అన్నారు హీరో సిద్ధార్థ్. టికెట్ రేట్స్ తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ట్విటర్లో సిద్ధార్థ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. సిద్ధార్థ్ మాట్లాడుతూ ‘25 ఏళ్ల క్రితం స్టూడెంట్ ఐడీ కార్డ్ను ఉపయోగించి విదేశాల్లో మొదటి సినిమా చూసా. అప్పుడు ఎనిమిది డాలర్స్ టికెట్ రేట్ ఉంది. మన కరెన్సీలో రెండు వందలతో సమానం. ప్రస్తుతం మన సినిమాలు సాంకేతికత, ప్రతిభ, ఉద్యోగకల్పనలో విదేశీ సినిమాలతో పోటీపడుతున్నాయి. అయినా టికెట్ ధరలు మాత్రం అంతే ఉన్నాయి. వ్యాపారాన్ని ఎలా చేయాలో మాకు చెప్పొద్దు. మీ జోక్యంతో నిర్మాతలను, కార్మికుల్ని దూరం చేయద్దు. సబ్సిడీల మీద కాకుండా ఎంటర్టైన్మెంట్పై మాత్రమే ఆధారపడిన ఇండస్ట్రీ ఇది. సినిమా బడ్జెట్, స్థాయిని నిర్ణయించే హక్కు దర్శకుడికి, నిర్మాతకు ఉంటుంది తప్ప కొనుగోలుదారుడికి కాదు. సినిమా టికెట్ రేట్లను నిర్ణయించే హక్కు నాయకులు, ప్రభుత్వాలకు లేదు. ప్రేక్షకులకు వినోదాన్ని అందించడానికి ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరం ఎంతో కష్టపడుతున్నాం. ఆ ఆనందాన్ని దూరం చేయొద్దు. పేదవారిగా పుట్టి బిలియనీర్స్గా మారిన రాజకీయనాయకుల్ని, వ్యాపారవేత్తలను ఎందుకు ప్రశ్నించడం లేదు. సినీ పరిశ్రమయే ప్రతిసారి ఎందుకు సమస్యగా కనిపిస్తుంది’ అని అన్నారు.