సెకండ్ ఇన్నింగ్స్లో శరవేగంగా సినిమాలు చేస్తున్నారు స్టార్ హీరో చిరంజీవి. ఇటీవలే ‘గాడ్ ఫాదర్’ సినిమాతో విజయాన్ని అందుకున్నారు. ఈ ఉత్సాహంలో రెండు చిత్రాల షూటింగ్స్ చేస్తున్నారు. బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తన 154వ చిత్రంలో చిరంజీవి నటిస్తుండగా…మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ అనే మరో చిత్రాన్ని చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల షూటింగ్స్ సమాంతరంగా జరుగుతున్నాయి.
అయితే వీటిలో ‘గాడ్ ఫాదర్’ తర్వాత ఏ సినిమా ముందు తెరపైకి వస్తుందనే విషయాన్ని చిరంజీవి తాజాగా వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ… ‘రెండు సినిమాల షూటింగ్స్ జరుగుతున్నా..బాబీతో చేస్తున్న సినిమానే ముందుగా విడుదల చేస్తాం. ఆ సినిమా తర్వాతే ‘భోళా శంకర్’ ఉంటుంది’ అన్నారు. చిరంజీవి 154వ సినిమాకు ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమా తను నటించిన ‘రౌడీ అల్లుడు’ తరహాలో ఉంటుందని ఇటీవల చిరంజీవి చెప్పారు. దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ టీజర్ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం.