Comedian Bondamani | సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ తమిళ హాస్యనటుడు బోండా మణి (60) కన్నుమూశారు. తన రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో గత ఏడాది కాలంగా ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు బోండా మణి. అయితే వారం రోజుల నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించిందని.. చికిత్స పొందుతున్న క్రమంలోనే తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు.
శ్రీలంక తమిళుడైన బోండా మణి 1991లో భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ‘పౌను పౌనుతాన్స సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత సుందర ట్రావెల్స్, మరుదామలై, విన్నర్, అయి, వసీకరా, లాంటి చిన్న చిన్న పాత్రలతో ప్రారంభించి హాస్య నటుడిగా వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ముఖ్యంగా నటుడు వడివేలుతో అతడు నటించిన సినిమాలకు అభిమానుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇప్పటివరకు తన కెరీర్ లో దాదాపు 270 సినిమాలకు పైగా నటించారు. ఇక బోండా మణి మరణ వార్తతో కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం అలుముకుంది. పలు సినీ ప్రముఖులు ఆయన మృతికి నివాళులర్పిస్తున్నారు.