రాజ్తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రం ‘స్టాండప్ రాహుల్’. ‘కూర్చుంది చాలు’ అని ఉపశీర్షిక. శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. నందకుమార్, భరత్ మాగులూరి నిర్మాతలు. ఈ నెల 18న ప్రేక్షకులముందుకురానుంది. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో రాజ్తరుణ్ మాట్లాడుతూ ‘మా రెండేళ్ల ప్రయాణమిది. ఇందులో వినోదంతో పాటు ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది. ఎమోషన్స్ హృదయాన్ని స్పృశిస్తాయి. నా కెరీర్లో మంచి చిత్రంగా నిలిచిపోతుంది. ఈ తరహా కథాంశంతో తెలుగులో సినిమా రాలేదు’ అన్నారు. ‘నా జీవితంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ కథ రాసుకున్నా. నా జీవన పోరాటమే నన్ను దర్శకుణ్ణి చేసింది. నేటి యువతలో ఉత్తేజం నింపేలా ఈ కథ ఉంటుంది. మన జీవితంలో ఒడిదుడుకుల్ని ఎలా ఎదుర్కోవాలో స్టాండప్ కామెడీ ద్వారా చూపించాం’ అని దర్శకుడు చెప్పారు. విభిన్న ప్రయత్నంగా తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని నిర్మాతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.