SSMB 29 | సూపర్ స్టార్ మహేష్ బాబు- ఓటమెరుగని విక్రమార్కుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబీ 29 సినిమా బాక్సాఫీస్ టార్గెట్ ఏకంగా పది వేలు కోట్లు అన్న టాక్ ఫిల్మ్ వర్గాల్లో హీట్ పెంచేస్తోంది. ఇప్పటివరకు పాన్ ఇండియా అనే మాట వినిపించేది, కానీ ఈ సినిమా విషయంలో ఇది ఒక పాన్ వరల్డ్ మూవీ అన్నది ఇప్పుడు అధికారికంగా ఖరారైంది. ఇప్పటికే ఈ సినిమా గ్లోబల్ లెవెల్లో రిలీజ్ అవుతుందన్న ఊహాగానాలు ఉన్నా, తాజాగా కెన్యా ప్రభుత్వ అధికారులతో జరిగిన భేటీ తర్వాత ఈ సినిమా 120 దేశాల్లో విడుదల కాబోతున్నట్టు అధికారిక సమాచారం రావడం విశేషం. ఇది హాలీవుడ్ స్థాయికి సైతం సాధ్యంకాని ఫీట్ అని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
లీకుల ప్రకారం, ఈ చిత్రం రూ. 1200 కోట్లతో నిర్మితమవుతోంది. భారత సినీ చరిత్రలో ఇప్పటివరకు ఈ స్థాయిలో బడ్జెట్తో రూపొందుతున్న మొదటి చిత్రం ఇదే కావడం గమనార్హం. ఇంత భారీ బడ్జెట్ పెట్టిన తర్వాత సినిమా ఎంత వసూలు చేస్తుందనే దాని గురించి మాట్లాడుకోవడం సహజం. ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న మాట ప్రకారం, రాజమౌళి-మహేష్ కాంబో సినిమా టార్గెట్ ఏకంగా 10,000 కోట్లు అని వార్తలు వస్తున్నాయి. ఇది కేవలం కల కాదు, సాధ్యమయ్యే పని అని ట్రేడ్ అనలిస్ట్లు చెబుతున్నారు. ఈ భారీ ప్రాజెక్టును గ్లోబల్గా ప్రమోట్ చేయడానికి హాలీవుడ్ ప్రముఖ ఏజెన్సీలతో రాజమౌళి ఇప్పటికే చేతులు కలిపారు. ప్రచార కార్యక్రమాల నుంచి విడుదల వరకు అన్ని పనులు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో జరగనున్నాయి. ఇది భారతీయ సినిమా పరిశ్రమకు ఒక మైలురాయి కావడం ఖాయం.
‘బాహుబలి’, ‘ఆర్ ఆర్ ఆర్’ ఓ బెంచ్మార్క్ సెట్ చేయగా, బాహుబలి సిరీస్ కలిపి రూ. 2500 కోట్లకుపైగా వసూలు చేసింది. ఆర్ ఆర్ ఆర్ రూ. 1300 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ రెండు సినిమాలు 500 కోట్ల లోపల బడ్జెట్తో రూపొందాయి. ఈ సినిమాలు అంత భారీ వసూళ్లు సాధిస్తే, రూ. 1200 కోట్ల బడ్జెట్తో వస్తున్న మహేష్-రాజమౌళి మూవీకి రూ. 10,000 కోట్లు టార్గెట్ అనడం నిజంగానే సెన్సిబుల్ అని విశ్లేషకులు చెబుతున్నారు.ఎస్ఎస్ఎంబీ 29 సినిమాను ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని స్థాయిలో గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు. ఇది కేవలం సినిమా కాదు, ప్రపంచ సినిమా చరిత్రలో ఒక ఘట్టం అవుతుందనే నమ్మకంతో మేకర్స్ ముందుకు వెళ్తున్నారు.