Ee Nagaraniki Emaindi 2 | టాలీవుడ్లో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు శ్రీనాథ్ మాగంటి ఇప్పుడు ఒక భారీ ప్రాజెక్టులో భాగం కాబోతున్నాడు. ‘హిట్’ ఫ్రాంచైజీలో అభిలాష్గా, ఇటీవలి ‘లక్కీ భాస్కర్’లో సూరజ్గా మెప్పించిన ఆయన, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోని ‘యానిమల్’ సినిమాతో బాలీవుడ్లోనూ తన ముద్ర వేశారు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన కల్ట్ క్లాసిక్ ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్లో శ్రీనాథ్ మాగంటి హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తుంది.
ఈ సీక్వెల్ కోసం ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని, మొదటి భాగంలాగే ఇది కూడా వాస్తవ ఘటనల ఆధారంగా స్నేహబంధం నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. అయితే మొదటి భాగంలో కార్తీక్ పాత్రలో అలరించిన సుశాంత్ ఈ సీక్వెల్లో ఉండటం లేదని తరుణ్ భాస్కర్ ఇప్పటికే స్పష్టం చేశారు. సుశాంత్ లేకపోయినా కార్తీక్ పాత్ర ప్రయాణం కొనసాగుతుందని ఆయన పేర్కొనడంతో, ఇప్పుడు ఆ కీలక బాధ్యతను శ్రీనాథ్ మాగంటి భుజానికెత్తుకోబోతున్నారా అనే ఆసక్తి నెలకొంది. ఈ క్రేజీ అప్డేట్పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.