ప్రతి సంక్రాంతి సీజన్లో తనను లక్ష్యంగా చేసుకొని కొన్ని వెబ్సైట్స్ తప్పుడు వార్తలు రాస్తున్నాయని, ఇకపై అలాంటి అసత్య ప్రచారాలు చేసే వెబ్సైట్లను ఏమాత్రం ఉపేక్షించనని.. వారి తాటతీస్తానని ప్రముఖ నిర్మాత దిల్రాజు హెచ్చరించారు. శ్రీగణపతి సినిమాస్ సంస్థ నిర్మించిన ‘శ్రీకాకుళం షెర్లాక్హోమ్స్’ చిత్ర ఫస్ట్లుక్ లాంచ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనపై తప్పుడు వార్తలు రాస్తున్న వెబ్సైట్లపై దిల్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
“హనుమాన్’ ప్రీరిలీజ్ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడిన మాటలను కొన్ని వెబ్సైట్లు తప్పుగా వక్రీకరించాయి. వ్యూస్ కోసం నాపై విమర్శలు చేస్తూ వాళ్లకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇన్ని రోజులు ఇలాంటి విషయాలపై ఎక్కువగా స్పందించలేదు. చాలా సాఫ్ట్గా ఉన్నా. దిల్రాజు ఏం చేస్తాడులే అనుకుంటున్నారు. ఈ రోజు నుంచి ఊరుకునే ప్రసక్తిలేదు’ అని తీవ్రస్థాయిలో అగ్రహం వ్యక్తం చేశారు దిల్రాజు. వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన ‘శ్రీకాకుళం షెర్లాక్హోమ్స్’ చిత్రాన్ని కామెడీ థ్రిల్లర్గా తెరకెక్కించామని, చక్కటి వినోదంతో ఆకట్టుకుంటుందని దర్శకుడు రైటర్ మోహన్ తెలిపారు. ఆద్యంతం చక్కటి కామెడీతో ఈ సినిమా మెప్పిస్తుందని నిర్మాత వెన్నపూస రమణారెడ్డి పేర్కొన్నారు.