‘గోదావరి జిల్లాల్లో ఉండే కులవివక్షను, రాజకీయ అంతరాల్ని చర్చిస్తూ తెరకెక్కించిన చిత్రమిది. ఈ ప్రాంతం గురించి ప్రపంచానికి తెలియని మరో పార్శాన్ని సినిమాలో చూపించబోతున్నాం’ అని అన్నారు కరుణకుమార్. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. సుధీర్బాబు హీరోగా నటించారు. ఈ నెల 27న విడుదలకానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో కరుణకుమార్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ సంగతులివి..
దశాబ్దకాలంగా తెలుగులో మంచి కథల్ని చెప్పే సంస్కృతి తగ్గింది. ఫార్ములా సినిమాలు చేయడం అలవాటుగా మారింది. వినూత్నమైన కథలు చెబితే చూడటానికి తెలుగు ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. అలాంటి ఇతివృత్తాలతో సినిమాలు చేయాలనే లక్ష్యంతోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టా. సమాజంలో నెలకొన్న బలమైన సమస్యను చాటిచెబుతూ ఈ సినిమాను తెరకెక్కించాను. ఓ సోడా సెంటర్ యజమాని కూతురికి, ఎలక్ట్రీషియన్గా పనిచేసే యువకుడికి మధ్య సాగే ప్రేమకథ ఇది. ఆ జంట ప్రేమకు సమాజం, రాజకీయ పరంగా ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయన్నది ఈ చిత్ర ఇతివృత్తం. జీవితంలో స్థిరపడాలని కలలుగనే యువకుడిగా సుధీర్బాబు పాత్ర కొత్తగా ఉంటుంది.
తెలుగు నటీనటులతో సినిమాలు చేయడానికే నేను ఇష్టపడతా. ‘పలాస’లో తెలుగు అమ్మాయిని కథానాయికగా తీసుకోవాలని పలువురిని సంప్రదించా. కానీ పెద్ద హీరోల సినిమాల్లో నటించాలనే కోరికతో వారెవరూ నా కథ వినలేదు. సినిమాలో నటించమని అడిగితే చాలా మంది నాయికలు.. హీరో ఎవరనే ప్రశ్న వేస్తున్నారు తప్పితే కథేంటి అని అడగటం లేదు. ఆ ధోరణి మారాలి. హారర్ సినిమాలు నాకు నచ్చవు. ఆ జోనర్ తప్ప మిగతా కథాంశాలన్నింటితో సినిమాలు చేయాలనుంది.