నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి ప్రస్తుతం థియేటర్స్లో సందడి చేస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. భగవంత్ కేసరి పాత్రలో బాలయ్య ప్రేక్షకులని అలరిస్తే విజ్జి పాప పాత్రలో శ్రీలీల సర్ ప్రైజ్ చేస్తోంది.
ముఖ్యంగా శ్రీలీల నటనకు చాలా మంది ఫిదా అవుతున్నారు. తాజాగా నిర్మాత దిల్ రాజు ఈ చిత్రం విజయోత్సవ వేడుకలో పాల్గొని శ్రీలీల పై ప్రసంశలు కురిపించారు. ”నటిగా శ్రీలీలకు మంచి భవిష్యత్తు ఉంది. ఈ సినిమా విడుదలకు ముందు వరకు శ్రీలీల అంటే డ్యాన్స్ అనేవారు. కానీ, ఇందులోని ఆమె నటన జయసుధ, జయప్రద, శ్రీదేవిలను గుర్తు చేసింది. హీరోయిన్ గా శ్రీలీల గొప్ప స్థాయికి వెళుతుంది” అని చెప్పుకొచ్చారు దిల్ రాజు.
ఇక ఈ ఈవెంట్ లో దర్శకుడు అనిల్ రావిపూడి భగవంత్ కేసరి సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ తీసే ధైర్యం నాకు లేదు. ఈ బరువు మోసినందుకే చాలా నలిగిపోయా. సీక్వెల్ తీయగలిగే శక్తిని బాలకృష్ణ గారు నాకిస్తే వెంటనే తీస్తా” అని చెప్పారు.