Sridevi | అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవికు చెందిన విలువైన ఆస్తి వివాదం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో ఆమె భర్త, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్తో పాటు కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తమ కుటుంబానికి చెందిన భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ వారు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ టి.వి. తమిళ్సెల్వి నేతృత్వంలోని ధర్మాసనం స్థానిక కోర్టులో కొనసాగుతున్న చర్యలపై తాత్కాలిక స్టే విధించింది. తదుపరి విచారణను మార్చి 26, 2026కు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం కపూర్ కుటుంబానికి కొంత ఊరట లభించినట్లు అయింది.
చెంగల్పట్టులో ఉన్న సుమారు 4.7 ఎకరాల భూమిపై హక్కులు కోరుతూ కొందరు వ్యక్తులు సివిల్ దావా దాఖలు చేయగా, దాన్ని కొట్టివేయాలని కోరుతూ బోనీ కపూర్ కుటుంబం జాయింట్ పిటిషన్ వేసింది. ఈ భూమిని శ్రీదేవి 1988 ఏప్రిల్ 19న చట్టబద్ధంగా కొనుగోలు చేసినట్లు వారి తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ఈ ఆస్తికి అసలు యజమాని ఎం.సి. సంబంధ ముదలియార్ కాగా, ఆయన కుటుంబంలో 1960లో జరిగిన ఆస్తి పంపకాల ఒప్పందం ఆధారంగానే శ్రీదేవి ఈ భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. అప్పటి నుంచి ఈ ఆస్తి పూర్తిగా ఆమె కుటుంబ ఆధీనంలోనే ఉందని కూడా వాదించారు.
అయితే, తమను ముదలియార్ వారసులమని చెప్పుకుంటూ ముగ్గురు వ్యక్తులు ఈ ఆస్తిపై హక్కులు కోరుతూ వివాదాన్ని సృష్టించారు. వారు 2005లో తాంబరం తహసీల్దార్ కార్యాలయం నుంచి వారసత్వ ధ్రువపత్రం పొందినట్లు తెలిపారు. దీనిపై బోనీ కపూర్ తరఫు న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించారు. ముదలియార్ కుటుంబం తాంబరంలో కాకుండా మైలాపూర్లో నివసించేదని, అందువల్ల తాంబరం తహసీల్దార్ జారీ చేసిన వారసత్వ ధ్రువపత్రం సరైనది కాదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా వారసులమని చెప్పుకుంటున్న వారిలో ఒకరు ముదలియార్ కుమారుడి రెండో భార్య అని క్లెయిమ్ చేస్తున్నారని తెలిపారు. అయితే మొదటి భార్య బతికే ఉన్న సమయంలో జరిగిన ఆ వివాహం చట్టబద్ధం కాదని, హిందూ వారసత్వ చట్టం ప్రకారం వారికి ఆస్తిలో హక్కు ఉండదని వాదించారు.
ఈ వాదనలను పరిశీలించిన జస్టిస్ ఎన్. ఆనంద్ వెంకటేష్, ఆ ముగ్గురు వ్యక్తుల పేరుతో జారీ చేసిన వారసత్వ ధ్రువపత్రం మోసపూరితమై ఉండే అవకాశముందని వ్యాఖ్యానించారు. దీనిని రద్దు చేసే విషయంపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని తాంబరం తాలూకా తహసీల్దార్కు ఆదేశాలు జారీ చేశారు.ప్రస్తుతం ఈ కేసు హైకోర్టు పరిధిలో కొనసాగుతోంది. మోసపూరిత పత్రాలతో తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీదేవి కుటుంబం కోరుతోంది. తదుపరి విచారణలో కోర్టు ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.