Sri Gouri Priya | తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్న యువ నటి శ్రీ గౌరి ప్రియ మరోసారి వార్తల్లో నిలిచింది. వరుసగా విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ తెలుగమ్మాయి ప్రస్తుతం హీరో కిరణ్ అబ్బవరంతో కలిసి ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ‘వదలనే’ పాట లాంచ్ ఈవెంట్లో శ్రీ గౌరి ప్రియ చేసిన వ్యాఖ్యలు అందరినీ భావోద్వేగానికి గురి చేశాయి. హైదరాబాద్లో సోమవారం రాత్రి నిర్వహించిన ‘వదలనే’ సాంగ్ లాంఛ్ ఈవెంట్లో చిత్ర బృందం పాల్గొంది. కార్యక్రమంలో యాంకర్ స్రవంతి చొక్కారపు అక్కడికి వచ్చిన నటీనటులను ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగింది. “ఈ పాటలోని లిరిక్స్ను ఎవరికి అంకితం చేస్తారు?” అని ప్రశ్నించగా, శ్రీ గౌరి ప్రియ సమాధానం ఇస్తూ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైంది.
శ్రీ గౌరి ప్రియ మాట్లాడుతూ..”నిజంగా చెప్పాలంటే మా అమ్మ నన్ను వదిలేసి మూడేళ్లు అయింది. కానీ తను నన్ను అసలు వదల్లేదు. నేను కూడా తనను ఎప్పటికీ వదలను. ఈ విషయం తనకు తెలుసు, నాకు తెలుసు. ఈ పాటలోని లైన్స్ను మా అమ్మకే అంకితం చేస్తున్నాను” అని చెప్పింది.ఆమె మాటలు విన్న వెంటనే కార్యక్రమంలో ఉన్నవారు కొద్దిసేపు నిశ్శబ్దంగా మారిపోయారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. అభిమానులు, నెటిజన్లు శ్రీ గౌరి ప్రియ ధైర్యాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
మూడేళ్ల క్రితం శ్రీ గౌరి ప్రియ తల్లి వసుంధర క్యాన్సర్ కారణంగా మరణించారు. తల్లితో తనకు చాలా ఆత్మీయ అనుబంధం ఉండేదని గౌరి ప్రియ పలు సందర్భాల్లో వెల్లడించింది. ఆమెను కేవలం తల్లిగానే కాకుండా ఒక మంచి స్నేహితురాలిగా భావించేదని చెప్పింది. తల్లి మరణంతో కొంతకాలం తీవ్ర మానసిక వేదనకు గురైన ఆమె, ఆ తర్వాత మళ్లీ తన కెరీర్పై దృష్టి పెట్టింది.శ్రీ గౌరి ప్రియ ఇప్పటికే ‘మెయిల్’, ‘మోడర్న్ లవ్ చెన్నై’, MAD, రైటర్ పద్మభూషణ్ , ‘లవర్’, ‘హ్యాపీ రాజ్’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు చేరువైంది. ప్రస్తుతం ‘చెన్నై లవ్ స్టోరీ’ తో పాటు ‘వీసా – వింటారా సరదాగా’, ‘బ్రో కోడ్’ వంటి చిత్రాలు కూడా ఆమె చేతిలో ఉన్నాయి. కాగా, హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. సంగీత దర్శకుడు మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు.