Sreeleela |టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీలీల మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి సినిమా అప్డేట్తో కాదు, సోషల్ మీడియాలో ఆమె చేసిన ఓ భావోద్వేగ పోస్ట్ కారణంగా చర్చకు వచ్చింది. కృత్రిమ మేధస్సు (AI) పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం, అభ్యంతరకర వీడియోలు, ఫొటోలు, ట్రోలింగ్ కంటెంట్పై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. రెండు చేతులు జోడించి చేసిన ఆమె విజ్ఞప్తి ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది.‘పెళ్లి సందడి’ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన శ్రీలీల, తొలి సినిమాతోనే యువ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అతి తక్కువ సమయంలోనే వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఆమె, ఒకేసారి తొమ్మిది సినిమాలకు సైన్ చేసి ఇండస్ట్రీలో రికార్డ్ సృష్టించింది. సక్సెస్, ఫెయిల్యూర్ అనే తేడా లేకుండా కెరీర్ను దూకుడుగా ముందుకు తీసుకెళ్తూ, ఇటీవల బాలీవుడ్పై కూడా దృష్టి పెట్టింది.
అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఏఐ పేరుతో వైరలవుతున్న కొన్ని అభ్యంతరకర కంటెంట్ తనను తీవ్రంగా కలచివేశాయని శ్రీలీల వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆమె చేసిన పోస్ట్లో, “నేను రెండు చేతులు జోడించి ప్రతి సోషల్ మీడియా యూజర్ను వేడుకుంటున్నాను. ఏఐతో క్రియేట్ చేసిన అభ్యంతరకర, అసభ్యకర కంటెంట్కు సపోర్ట్ చేయకండి. టెక్నాలజీ అభివృద్ధి మన జీవితాలను సులభతరం చేయడానికి ఉండాలి కానీ, వాటిని మరింత సంక్లిష్టం చేయడానికి కాదు” అంటూ హెచ్చరించారు. ఏఐ టెక్నాలజీని వినియోగించడానికీ, దుర్వినియోగం చేయడానికీ మధ్య స్పష్టమైన తేడా ఉందని ఆమె పేర్కొన్నారు. వినోదం పేరుతో మహిళలను లక్ష్యంగా చేసుకుని చేసే ట్రోలింగ్, మానసిక వేధింపులు ఎంతటి నష్టాన్ని కలిగిస్తాయో తన మాటల్లో వెల్లడించారు. “ప్రతి అమ్మాయి ఎవరికో ఒకరికి కూతురు, మనవరాలు, సోదరి, స్నేహితురాలు లేదా సహచరురాలు. కళను ఒక వృత్తిగా ఎంచుకున్నందుకే ఆమెను అవమానించడం, లక్ష్యంగా చేసుకోవడం సమంజసం కాదు” అంటూ భావోద్వేగంగా స్పందించారు.
ఇండస్ట్రీపై కూడా శ్రీలీల కీలక వ్యాఖ్యలు చేశారు. “మేము ప్రేక్షకులకు ఆనందాన్ని అందించాలని కోరుకుంటాం. అదే సమయంలో ఇది మాకు సురక్షితమైన వాతావరణం అనే నమ్మకం కూడా ఉండాలి” అని చెప్పారు. ఈ ఘటన తనను తీవ్రంగా బాధించిందని, ఇప్పటివరకు చిన్న విషయాలను పట్టించుకోకుండా జీవించినా, ఈ అంశం మాత్రం మనసును నొప్పించిందని ఆమె వేదన వ్యక్తం చేశారు. ఇది తన ఒక్కదాని సమస్య కాదని, చాలా మంది ఇలాంటి దాడులను ఎదుర్కొంటున్నారని శ్రీలీల స్పష్టం చేశారు. “నా తరఫునే కాదు, ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న నా సహచరుల తరఫున కూడా మాట్లాడుతున్నాను. మా వెంట నిలబడి మాకు మద్దతివ్వండి. ఇకపై ఈ విషయాన్ని సంబంధిత అధికారులు చూసుకుంటారు” అని పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీలీల చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తూ, ఏఐ టెక్నాలజీని బాధ్యతాయుతంగా ఉపయోగించాలన్న ఆమె సందేశాన్ని ప్రశంసిస్తున్నారు.