హీరో శ్రీవిష్ణు పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో నటించిన సినిమా ‘అల్లూరి’. లక్కీ మీడియా బ్యానర్పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించారు. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కయాదు లోహర్ నాయికగా నటించింది. ఈ నెల 23న సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తాజా ప్రెస్మీట్లో తెలిపారు హీరో శ్రీ విష్ణు. ఆయన మాట్లాడుతూ…‘అల్లూరి అనే కల్పిత పాత్ర ద్వారా కొన్ని యథార్థ ఘటనలను కథగా చేసుకుని రూపొందించిన చిత్రమిది. నిజాయితీ గల ఒక పోలీస్ అధికారి తన 15 ఏళ్ల సర్వీస్లో సమాజ హితం కోసం ఏం చేశాడనేది ఆసక్తికరంగా చూపించాం. మన దగ్గర జరుగుతున్న మంచీ చెడులు కథలో ఉంటాయి. దర్శకుడు ప్రదీప్ నా దగ్గరకు కథ తీసుకొచ్చినప్పుడు పోలీస్ కథలో నేను మెప్పించగలనా అనిపించింది. వద్దని చెప్పేద్దాం అని కథ విన్నాను. నెరేషన్ విన్నాక చేయనని చెప్పలేకపోయాను. మనకు ఎందరో గొప్ప గొప్ప పోలీస్ అధికారులు సేవలందించారు. వారందరినీ స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కించిన చిత్రమిది. వీరందరినీ ప్రతిబింబించేలా నా పాత్ర ఉంటుంది.
మా చిత్రాన్ని వారికి నివాళిగా చెప్పుకోవచ్చు. మంచి పోలీసులందరిలోనూ ఉండే సహజమైన లక్షణం సిన్సియారిటీ. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు ఆ ప్రభావం నా వ్యక్తిగత జీవితంపైనా పడింది. నా కళ్ల ముందు ఏదైనా తప్పు జరిగితే అడగటం ప్రారంభించాను. పక్కింటి కుర్రాడు అనే ముద్ర నాపై ఉంది. ప్రేక్షకులు ఆదరిస్తున్నారు కదా అని అన్నీ అలాంటి కథలే ఎంపిక చేసుకుంటే బోర్ కొట్టేస్తాను. అందుకే వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తున్నాను. ఈ క్రమంలో కొంత ఆలస్యమైనా మంచి చిత్రాలు చేస్తున్నాననే సంతృప్తి ఉంది. మనసుకు నచ్చిన సినిమాలు ఎంచుకుని, అవి బాగా వచ్చేలా కష్టపడటమే నా చేతిలో పని, ఫలితం ప్రేక్షకులు ఇవ్వాలి. నా కెరీర్లో అల్లు అర్జున్ అందించిన సహకారం మర్చిపోలేను. ప్రస్తుతం హసిత్ గోలి, సాయి, హర్ష దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నాను. వీటితో పాటు ఒక యూరోపియన్ ఫిల్మ్ అంగీకరించాను’ అన్నారు.