Sp Charan | టాలీవుడ్ లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం కొడుకు ఎస్పీ చరణ్ తరుణ్ భాస్కర్ కీడా కోలా టీమ్కు లీగల్ నోటీసులు పంపాడు. తన తండ్రి (ఎస్పీ బాలసుబ్రమణ్యం) వాయిస్ను ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో రీ క్రియేట్ చేసి కీడా కోలా సినిమాలో వాడుకున్నందుకు ‘కీడా కోలా’ చిత్ర నిర్మాతతో పాటు సంగీత దర్శకుడు వివేక్ సాగర్లకు ఎస్పీ చరణ్ నోటీసులు పంపారు.
”మాకు దూరమైన మా తండ్రి వాయిస్ని ఏఐ ద్వారా రీక్రియేట్ చేయడం మంచి విషయమే. కానీ, దీనిపై కనీసం మాకు ముందస్తు సమాచారం ఏం లేదు. మా అనుమతి లేకుండా ఆయన గొంతును రీక్రియేట్ చేయడం మాకు బాధ కలిగించింది. వ్యాపారం కోసం ఇలాంటి పనులు చేయడం సరికాదన్నారు. అందుకే ఈ విషయంలో లీగల్గా వెళ్లామని చరణ్ పేర్కొన్నారు.
పెళ్లి చూపులు (Pelli Choopulu), ఈ నగరానికి ఏమైంది (ENE) చిత్రాల ఫేమ్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) స్వీయ దర్శకత్వంతో వచ్చిన చిత్రం ‘కీడా కోలా’ (Keedaa Cola). బ్రహ్మనందం, చైతన్య రావు, రాగ్ మయుర్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. సరికొత్త క్రైమ్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ దగ్గుబాటి రానా సమర్పణలో నవంబర్ 03న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది.