Sp Charan | టాలీవుడ్ లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం కొడుకు ఎస్పీ చరణ్ తరుణ్ భాస్కర్ సినిమా కీడా కోలా టీమ్కు లీగల్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. తన తండ్రి (ఎస్పీ బాలసుబ్రమణ్యం) వాయిస్ను ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో రీ క్రియేట్ చేసి కీడా కోలా సినిమాలో వాడుకున్నందుకు ‘కీడా కోలా’ చిత్ర నిర్మాతతో పాటు సంగీత దర్శకుడు వివేక్ సాగర్లకు ఎస్పీ చరణ్ నోటీసులు పంపారు. అయితే తాజాగా నష్టపరిహారం విషయమై అల్టిమేటమ్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
ఈ వివాదంపై ఎస్పీ చరణ్ తరఫు లాయర్ స్పందిస్తూ.. అనుమతి లేకుండా లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం వాయిస్ను వాడుకున్నందుకు గాను కీడా కోలా టీమ్ క్షమాపణ చెప్పడంతో పాటు రూ.కోటి నష్టపరిహారం, రాయల్టీలో షేర్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో ఈ వివాదం రోజు రోజుకు ముదురుతున్నట్లు తెలుస్తుంది. కాగా దీనిపై దర్శకుడు తరుణ్ భాస్కర్ స్పందించాల్సి ఉంది.
ఇంతకి ఏం జరిగింది?
పెళ్లి చూపులు (Pelli Choopulu) ఫేమ్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) స్వీయ దర్శకత్వంతో వచ్చిన చిత్రం ‘కీడా కోలా’ (Keedaa Cola). బ్రహ్మనందం, చైతన్య రావు, రాగ్ మయుర్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. సరికొత్త క్రైమ్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ దగ్గుబాటి రానా సమర్పణలో నవంబర్ 03న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది. అయితే ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో ఎస్పీ బాలు గొంతుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పాడించారు. ఇక అనుమతి లేకుండా SPB వాయిస్ వాడుకున్నందుకు గాను ‘కీడా కోలా’ చిత్ర నిర్మాతతో పాటు సంగీత దర్శకుడు వివేక్ సాగర్లకు ఎస్పీ చరణ్ నోటీసులు పంపారు.