Indian Idol Season-2 Winner | ‘ఆహా’ ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న ‘తెలుగు ఇండియన్ ఐడల్-2’కు తెరపడింది. సీజన్-1కు తిరుగులేని రెస్పాన్స్ రావడంతో సీజన్-2ను మరింత గ్రాండియర్ గా నిర్వహించారు. ఇక ఎప్పుఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఫినాలే ఎపిసోడ్ ఆదివారం ముగిసింది. హేమచంద్ర హోస్ట్ గా చేసిన ఈ రియాలిటీ షోకు సంగీత దర్శకుడు థమన్, సింగర్ కార్తిక్, గీతామాధురిలు జడ్జ్లుగా వ్యవహరించారు. జయరామ్, సౌజన్య, లాస్య ప్రియ, కార్తికేయ, శృతి నండురిలు ఫైనల్కు రాగా.. వీళ్ళలో ఎవరు టైటిల్ విజేతగా నిలుస్తారు అన్న సస్పెన్స్కు తెరపడింది. ఈ ఫినాలే ఎపిసోడ్కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్గా వచ్చి కంటెస్టెంట్లను తనదైన శైలిలో ప్రశంసిస్తూ ఈ ఎపిసోడ్కు కళ తీసుకొచ్చాడు.
ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఫినాలే ఎపిసోడ్లో సౌజన్య విజేతగా నిలిచింది. అల్లు అర్జున్ చేతుల మీదుగా ట్రోఫీని అందుకుంది. ట్రోఫీతో పాటు సౌజన్య రూ.10 లక్షల నగదు బహుమతి అందుకుంది. మొదటి రన్నరప్గా నిలిచిన జయరాజ్ కు 3 లక్షలు, రెండవ రన్నరప్గా నిలిచిన లాస్యకు 2 లక్షల చెక్ అందజేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. తెలుగు ఇండియన్ ఐడల్ 2 ఫినాలేలో పాల్గొనటం ఎంతో థ్రిల్లింగ్గా అనిపించింది. సంగీతంలో ఎంతో ప్రతిభావంతులైన వీరి ప్రదర్శన చూసి మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఈ షో నాకెంతో ప్రత్యేకమైనది, మరచిపోలేని జ్ఞాపకంగా మిగిలిందనాలి. సౌజన్యకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు సింగింగ్ కు గ్యాప్ ఇవ్వలేదు. వచ్చిందంతే. ఇక పై గ్యాప్ ఉండదు. మీరు పాడుతున్న విధానం , తెలుగు భాషపై మీకున్న పట్టును మెచ్చుకోవాలి. రెండేళ్ల చిన్నారికి తల్లిగా ఉంటూ ఎంతో అంకిత భావంతో ఈ పోటీల్లో పాల్గొనటం.. ఓ వైపు సంగీతం, మరో వైపు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకోవటం అనేది అంత సులువైన విషయం కాదు. అలాగే ఆమె భర్త నుంచి లభించిన సహకారం, ప్రేమ చూస్తే ఆమె ఎంతో అదృష్టవంతురాలని అనిపిస్తుంది. సౌజన్య సాధించిన ఈ విజయం అందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చేది. ఆమె సంగీత ప్రయాణంలో ఇలాంటి విజయాలను మరెన్నింటిలో అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నాడు.