‘మా కంటే మా కలలు పెద్దవి’ అంటూ..సమాజానికి తమ విజయాలతో సమాధానం చెప్పబోతున్నారు సోనాక్షి సిన్హా, హ్యూమా ఖురేషి. లావున్నారని వెక్కిరించే వారికి గెలిచి చూపిస్తామంటున్నారు. సోనాక్షి, హ్యూమా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘డబుల్ ఎక్స్ఎల్’. ఈ చిత్రాన్ని దర్శకుడు సత్రాం రమానీ రూపొందిస్తున్నారు. వచ్చే నెల 4న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందీ మూవీ. ఈ చిత్రంలో స్పోర్ట్స్ ప్రెజెంటర్ రాజశ్రీ త్రివేది పాత్రలో హ్యూమా ఖురేషి నటిస్తుండగా…ఫ్యాషన్ డిజైనర్ సైరా ఖన్నా క్యారెక్టర్లో సోనాక్షీ సిన్హా కనిపించనుంది. ‘నువ్వు స్పోర్ట్స్ ప్రెజెంటరా? టీవీ సైజ్కు సరిపోతావా?’ అని ఎగతాళి చేసిన వారికి తాను అనుకున్నది సాధించి చూపిస్తుంది రాజశ్రీ, ‘నువ్వు ఫ్యాషన్ డిజైనర్ అయితే నీ దుస్తులు నీకే పట్టవు’ అనేవారికి పేరున్న డిజైనర్ అయి చూపిస్తుంది సైరా. బరువైన ఈ ఇద్దరు భామలు సొసైటీ నుంచి ఎదుర్కొనే మాటలు నేటి సమాజ తీరును చూపిస్తాయని, అవి భరిస్తూ వారు సాధించే విజయాలు స్ఫూర్తి నింపుతాయని చిత్రబృందం చెబుతున్నది. ఈ చిత్రంలో ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధావన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు.