సొహైల్, మోక్ష జంటగా నటిస్తున్న సినిమా ‘లక్కీ లక్ష్మణ్’. ఈ చిత్రాన్ని దత్తాత్రేయ మీడియా పతాకంపై హరిత గోగినేని నిర్మిస్తున్నారు. ఏఆర్ అభి దర్శకుడు. వినోదాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. తాజాగా చిత్ర ఫస్ట్ లుక్ను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ఏఆర్ అభి మాట్లాడుతూ..‘వినోదాలు పంచే కుటుంబ కథా చిత్రమిది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేశాం. త్వరలోనే సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. మా అభిమాన దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఫస్ట్ లుక్ విడుదల చేయడం సంతోషంగా ఉంది’ అన్నారు. ‘విభిన్న కథా చిత్రమిదని, మంచి కాఫీ తాగిన అనుభూతిని అందిస్తుందని చెప్పారు నిర్మాత హరిత గోగినేని. రాజా రవీంద్ర, సమీర్, కాదంబరి కిరణ్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ : ప్రవీణ్ పూడి, సినిమాటోగ్రఫీ : ఐ ఆండ్రూ, సంగీతం : అనూప్ రూబెన్స్.