ఇమేజ్ లెక్కలు, కమర్షియల్ సూత్రాలతో పట్టింపులు లేకుండా కొత్తదనంతో కూడిన కథలు, పాత్రలకు ప్రాముఖ్యతనిస్తూ కెరీర్ను కొనసాగిస్తున్నది నిత్యామీనన్. నవతరం హీరోల్లో సత్యదేవ్ ఇదే పంథాను అనుసరిస్తున్నాడు. వీరిద్దరు కలిసి నటించిన తాజా చిత్రం స్కైలాబ్. విశ్వక్ఖండేరావు ఈ సినిమాతో దర్శకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యారు. పృథ్వీ పిన్నమరాజు నిర్మించారు. నిత్యామీనన్ కథానాయికగా నటిస్తూనే సహనిర్మాతగా వ్యవహరించడంతో అందరిలో ఈసినిమా ఆసక్తిని రేకెత్తించింది. వాస్తవ ఘటనలను ఆధారంగా చేసుకొని కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకున్నది?నిత్యామీనన్, సత్యదేవ్లకు కమర్షియల్ హిట్ దక్కిందా?లేదా తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే…
కరీంనగర్ జిల్లాలోని బండలింగపల్లి అనే కల్పిత ఊరికి చెందిన ముగ్గురి జీవితాల కథ ఇది. ఆ ఊరి దొర వెంకటరాజు ఏకైక పుత్రిక గౌరి(నిత్యామీనన్) జర్నలిస్ట్గా మంచి పేరు తెచ్చుకోవాలని కలలు కంటుంది. దొర బిడ్డగా కాకుండా తనకంటూ ఓ సొంత గుర్తింపు రావాలన్నది ఆమె తాపత్రయం. పత్రికల కోసం ఎలాంటి కథలు రాయాలో తెలియని సందిగ్ధతతో కొట్టుమిట్టాడుతుంటుంది. అనారోగ్యం పేరుతో తండ్రి ఆడిన నాటకం కారణంగా హైదరాబాద్ నుంచి బండలింగపల్లి వస్తుంది. తన ఊరిలోనే కథలను అన్వేషిస్తుంటుంది. ఆనంద్ (సత్యదేవ్) ఓ డాక్టర్. చాలా అవకాశవాది. తన అవసరాల కోసం ఎదుటివారిని వాడుకోవడంలో తప్పులేదన్నది అతడి సిద్ధాంతం.
రద్ధయిన మెడికల్ లైసెన్స్ కోసం అతడికి ఐదు వేల రూపాయలు అవసరం అవుతాయి. అన్ని దారులు మూసుకుపోవడంతో చివర ప్రయత్నంగా డబ్బు కోసం బండలింగపల్లిలో ఉన్న తాత (తనికెళ్లభరణి) దగ్గరకు వస్తాడు. ఆ ఊరిలోనే క్లినిక్ను ఏర్పాటు చేసి తనకు అవసరమైన డబ్బు సంపాదించుకోవాలని అనకుంటాడు. తాతలు సంపాదించిన ఆస్తులు మొత్తం పోవడంతో ఊరంతా అప్పులు చేస్తూ బతుకుతుంటాడు సుబేదార్ రామారావు (రాహుల్ రామకృష్ణ). వంశానికి ఉన్న గౌరవం వల్ల ఉద్యోగం చేయడం నామోశీ అనే భానవతో ఉంటాడు. తన అప్పులన్నీ తీర్చే దారి కోసం ఎదురుచూస్తుంటాడు. ఈ ముగ్గురి లక్ష్యాలు ఎలా నెరవేరాయి?వారిలో ఏ విధంగా పరివర్తన వచ్చిందన్నది ఈ చిత్ర కథ.
1979లో నాసా ప్రవేశపెట్టిన స్కైలాబ్ ఉపగ్రహం భూమిపై పడిపోతుందని, భారీ ప్రాణ నష్టం సంభవించనుందనే పుకార్లు వచ్చాయి. ఆ వాస్తవ ఘటనకు ముగ్గురి జీవితాలను జోడిస్తూ దర్శకుడు విశ్వక్ ఖండేరావు ఈ కథ రాసుకున్నారు. ఆనాటి పల్లె గ్రామీణ జీవితం, కట్టుబాట్లు, కుల వివక్ష, ప్రజల్లో ఉన్న అమాయకత్వం నుంచి వినోదం, ఎమోషన్స్ను రాబ్టటుకుంటూ కథనాన్ని అల్లుకున్నారు. చావు భయం ప్రజల్లో ఉన్న వివక్ష, మూఢనమ్మకాల్ని ఎలా రూపుమాపిందో చూపించారు. చిన్న పాయింట్తో రెండున్నర గంటలు ప్రేక్షకుల్ని నవ్వించాలని దర్శకుడు అనుకున్నారు. నిత్యామీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ పాత్రలను పరిచయం చేయడానికే ప్రథమార్థం మొత్తం కేటాయించారు దర్శకుడు.
ఒక్కో పాత్ర తాలూకు కలలు, లక్ష్యాలను సాధించే క్రమంలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూలంకుషంగా చెబుతూ వెళ్లారు. ఆ సన్నివేశాలన్నీ సాగతీతగా ఉంటాయి. కథ ఎంతకు ముందుకు కదలక అక్కడే తిరుగుతూ ఉంటుంది. గౌరి తన సొంత ఊరికి రావడం, ఆమె గొప్ప పాత్రికేయురాలు అనే భ్రమలో ఉండటం ఆ అబద్దాన్ని ఆమె తల్లితో పాటు ఇంట్లో పనిచేసే యువకుడు దాచడం లాంటి సంఘటనల్లో కొన్నింటిని నుంచి మాత్రమే కామెడీ పండింది. ఆ ఎపిసోడ్లో చూసిన సన్నివేశాలనే మళ్లీ మళ్లీ చూస్తున్నట్లుగా ఉంటుంది.
డబ్బుల కోసం రాహుల్ రామకృష్ణను వాడుకోవడానికి సత్యదేవ్ వేసే ఎత్తులు, అందుకు సంబంధించిన ట్రాక్లో ఆసక్తి లోపించింది. స్కైలాబ్ పడుతుందని ప్రచారం మొదలైన తర్వాతే కథలో చలనం వస్తుంది. తాను రాసే వార్తల్లో జీవం లేదని తెలుసుకున్న గౌరి ఎలా తనను తాను మార్చుకుందో ద్వితీయార్థంలో చూపించారు. డబ్బు మాత్రమే ముఖ్యం కాదని అనుబంధాలు, నమ్మకాలు విలువైనవని ఆనంద్ తెలుసుకోవడం, వంశ ప్రతిష్టఅనే భ్రమ నుంచి బయటపడి సుబేదార్రామారావు వాస్తవ జీవితంలోకి ఎలా వచ్చాడో ముగింపులో చెప్పారు.
ఈ పతాక ఘట్టాల్లో వచ్చే ఎమోషన్స్ బాగున్నాయి. వాటి కోసమే రెండు గంటల పాటు కాలక్షేపం చేసిన భావన కలుగుతుంది. సత్యదేవ్, రాహుల్ రామకృష్ణలో మార్పుకు దారితీసిన సంఘటలను బలంగా చూపించలేకపోయారు. ఆ సన్నివేశాల నుంచి వినోదం, భావోద్వేగాలను సరిగా రాబట్టుకోలేదు. స్కైలాబ్ అనేది ఇందులో ఉపకథ మాత్రమే. అదే ప్రధాన కథాంశం అంటూ చిత్రబృందం ప్రచారం చేశారు. స్కైలాబ్ తాలూకు కథ చెబుతారేమోనని థియేటర్లో అడుగుపెట్టిన ప్రేక్షకులకు నిరాశే మిగులుతుంది.
గౌరిగా నిత్యామీనన్ పాత్ర ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. స్వీయగుర్తింపు కోసం తాపత్రయపడే యువతిగా చక్కటి హవభావాల్ని, నటనను కనబరించింది. అవకాశవాదిగా జీవితాన్ని మొదలుపెట్టి మంచి మనిషిగా మారిన యువకుడిగా సత్యదేవ్ కనిపించారు. కెరీర్ ఆరంభం నుంచి ఎక్కువగా సీరియస్ రోల్స్ చేస్తున్న అతడు తన పంథాకు భిన్నంగా కామెడీ టైమింగ్ ఉన్న పాత్రను ఈ సినిమాలో చేశాడు. సుభేదార్ రామారావుగా రాహుల్ రామకృష్ణ అక్కడక్కడా నవ్వించాడు. నిత్యామీనన్ సహాయకుడిగా విష్ణుకు మంచి పాత్ర దక్కింది. కథ, సన్నివేశాల్లో బలం లేకపోయినా తనకెళ్లభరణి, తులసి, నారాయణరావు వంటి సీనియర్ యాక్టర్ తమ నటనానుభవంతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశారు.
1979 కాలం నాటి పల్లె జీవితాన్ని, ఆనాటి యాస భాషల్ని సహజంగా ఈసినిమాలో చూపించారు. తెలంగాణ నేపథ్యంలో రాసుకున్న డైలాగ్లు ఈ సినిమాకు కొత్తదనాన్ని తీసుకొచ్చాయి. వాటిలో ఉన్న నవ్యత కథ, కథనాల్లో కొరవడింది. కామెడీని పండించే అవకాశం చాలా చోట్ల ఉన్న దర్శకుడు దానిని వాడుకోలేదు. స్కైలాబ్ ఘటన తాలూకు పరిణామాల్లో ప్రజల్లో ఏర్పడిన భయాల్ని ఆసక్తికరంగా చెప్పలేకపోయారు. వాటిని ప్రధాన పాత్రధారుల జీవితాలతో ముడిపెడుతూ కథను కన్వీన్సింగ్గా ఆవిష్కరించడంలో తడబడ్డారు. ఆదిత్య జవ్వాది సినిమాటోగ్రఫీ, ప్రశాంత్ విహారి నేపథ్య సంగీతం బాగున్నాయి.
స్కైలాబ్ ఘటన తాలూకు వాస్తవిక పరిస్థితులకు కల్పిత అంశాలను జోడిస్తూ కామెడీ సినిమా చేయాలనే ప్రయత్నం పూర్తిగా మిస్ఫైర్ అయ్యింది. కమర్షియల్గా ఈ సినిమా వర్కవుట్ కావడం కష్టమే. ఆర్ట్ సినిమా మాదిరిగా కథ, కథనాలు సాగడం, వినోదం లోపించడం సినిమాకు మైనస్గా మారింది.
రేటింగ్-2.25/5