బలమైన ప్రతినాయకుడి వల్లే శక్తివంతమైన హీరోయిజం ఎలివేట్ అవుతుంది. విలన్ ఎంపికలో చర్చోప చర్చలు జరిగేవి అందుకే. ఒక మంచి విలన్ దొరికితే.. అంటుంటారు దర్శకులు. రామ్ చరణ్ కొత్త చిత్రానికి కూడా ఇలాగే ప్రతినాయకుడు ఎవరన్నది అనేక ఆప్షన్స్ చుట్టూ తిరిగింది. చివరకు ఆ విలన్ దొరికేశాడు.
రామ్ చరణ్ కథానాయకుడిగా దర్శకుడు శంకర్ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దిల్ రాజు నిర్మాత. కియారా అద్వానీ నాయికగా నటిస్తున్నది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతోంది. ఇంతలో సినిమాకు విలన్ దొరికాడంటూ టీమ్ సంతోషపడుతోంది. తమిళ దర్శకుడు, నటుడు ఎస్జే సూర్య రామ్ చరణ్తో సై అంటే సై అనబోతున్నాడు.
ఎస్జే సూర్య మెగా కుటుంబానికి ఇష్టమైన దర్శకుడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఈ దర్శకుడు రూపొందించిన ఖుషి సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తుడిపోయే చిత్రాల్లో ఒకటిగా మిగిలిపోయింది. ఎస్జే సూర్య ఇప్పటికే మహేష్ బాబు స్పైడర్ సినిమాలో విలన్గా నటించాడు. ఇప్పుడు చరణ్తో ఢీకొట్టబోతున్నాడు. బాబాయిని ఖుషి చేసిన దర్శకుడు అబ్బాయితో గొడవపడితే తెరపై కొత్తగానే ఉండొచ్చు.