Shah Rukh Khan | హిందీ నటులలో దక్షిణాది ప్రేక్షకులు అమితంగా అభిమానించేది షారుఖ్ ఖాన్నే. ఆయన సినిమా రిలీజవుతుందంటే ఇక్కడ కూడా పెద్ద పెద్ద బ్యానర్లు, ఈలలు, గోలలతో థియేటర్లు మార్మోగిపోతుంటాయి. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో షారుఖ్ సినిమా రిలీజవుతుందంటే టాలీవుడ్ స్టార్ హీరో సినిమా రేంజ్లో సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి. ఇక ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితుడైన అట్లీతో జవాన్ చేస్తుండటంతో ఈ సినిమాపై వీర లెవల్లో అంచనాలున్నాయి. ఈ సినిమాతో కేవలం సౌత్లోనే షారుఖ్కు రెండొందల కోట్ల బొమ్మ అవుతుందనడంలో ఆశ్చర్యమే లేదు.
ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు గట్రా సినిమాపై ఓ రేంజ్లో హైప్ క్రియేట్ చేశాయి. అప్పుడే బాలీవుడ్ ట్రేడ్ షారుఖ్కు ఈ సినిమా మరో వెయ్యి కోట్ల బొమ్మవుతుందని అంచనా కూడా వేసేశారు. మరో పదిహేను రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంది. ప్రమోషన్ల స్పీడ్ కూడా పెంచేసింది. హిందీ నాట బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్లు చేస్తూ సినిమాపై జనాల్లో హైప్ ఎక్కిస్తున్నారు. ఇక తమిళంలో వచ్చే వారంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ను ప్లాన్ చేసి పెద్ద పెద్ద స్టార్లను గెస్ట్లుగా పిలవనున్నారట. అదే వేడుకలో మరో ట్రైలర్ను రిలీజ్ చేస్తారట.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఆరుగురు స్టంట్ మాస్టర్లు పనిచేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. మాములుగా ఇండియాన్ సినిమాలకు ఒకరిద్దరు మాత్రమే యాక్షన్ సీన్లు కొరియోగ్రఫి చేస్తుంటారు. కానీ తొలిసారి జవాన్ సినిమాకు ఏకంగా ఆరగురు ఫైట్స్ కంపోజ్ చేయడమనేది అందరనీ ఆశ్చర్యంలో పడేసింది. వాళ్లు కూడా ఆశా మాశీ స్టంట్ మాస్టర్లు కాదు. స్పైరో రజటోస్, యాన్నిక్ బెన్, క్రెయిన్ మ్యాక్రే, కెచా ఖంఫ్కాడె, సునీల్ రోడ్రిగ్స్, అనల్ అరసు వంటి వరల్డ్ క్లాస్ స్టంట్స్ మాస్టర్లు ఈ సినిమాకు యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేశారట.
ఈ లెక్కన యాక్షన్స్ సీన్స్ ప్రేక్షకులను ఏ రేంజ్లో ఆకట్టుకుంటాయో అన్న ఊహే గూస్బంప్స్ తెప్పిస్తుంది. ఇండియన్ సినీ చరిత్రలోనే కనీవిని ఎరుగుని రేంజ్లో యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నాయట. యాక్షన్ సీన్స్ చూసేటప్పుడు సీట్లలో ఒక్కరు కూడా కూర్చోరని ఇన్సైడ్ టాక్. రెడ్ చిల్లీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో షారుఖ్కు జోడీగా నయనతార నటిస్తుంది. దీపికా పదుకొనే గెస్ట్ రోల్ పోషిస్తుంది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. అనురుధ్ స్వరాలందించిన ఈ సినిమా సెప్టెంబర్ 7న హిందీ, తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజవుతుంది.