Vani Jayaram | గాయని వాణీ జయరాం హఠాన్మరణం ఇండస్ట్రీని దుఃఖ సాగరంలో నెట్టేసింది. శనివారం ఉదయం చెన్నైలోని తన నివాసంలో వాణి జయరాం కన్నుముశారు. ఆమె మరణంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వాణీ జయరాం తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్ 30 జన్మించారు. 8వ ఏటనే ఆలిండియా రేడియోలో పాట పాడి అబ్బురపర్చిన బాల మేధావి వాణీ జయరాం. ఆ తర్వాత కర్నాటక, హిందుస్తానీ సంగీతం నేర్చుకుని.. నేపథ్య గాయనిగా మారారు.
అయితే, వాణీ జయరాం సినీ ఎంట్రీ విచిత్రంగా జరిగింది. పెళ్లి తర్వాత ముంబైలో స్థిరపడ్డ వాణీ జయరాం.. అనుకోని విధంగా గుడ్డి మూవీలో అవకాశం వచ్చింది. అలా ఈ సూపర్ హిట్ హిందీ మూవీ ద్వారా సినీ సంగీత ప్రపంచంలోకి వాణీ జయరాం అడుగుపెట్టారు. ‘బోలె రే పపీ హరా’ పాటతో నేపథ్య గాయకురాలిగా ఆరంగేట్రం చేశారు. తెలుగు, తమిళం సహా దాదాపు 19భాషల్లో ఇప్పటి వరకు ఇరవై వేలకు పైగా వాణీ జయరాం పాటలు పాడారు. వెయ్యి సినిమాలకు పైగా ప్లే బ్యాక్ సింగర్గా వ్యవహరించారు. ముఖ్యంగా భక్తి పాటలకు పెట్టిన పేరు ఆమెది. 1973లో వచ్చిన ‘అభిమానవంతులు’ సినిమాతో తన గాత్రాన్ని తెలుగువారికి పరిచయం చేసారు. అయితే 1975లో వచ్చిన ‘పూజా’ సినిమాలోని ‘ఎన్నేన్నో జన్మలబంధం’ సాంగ్తో మంచి పాపులారిటి తెచ్చుకున్నారు.
వాణీ జయరాం మూడు నేషనల్ అవార్డులను గెలుచుకున్నారు. కమల్హాసన్ హీరోగా నటించిన ‘అపూర్వ రాగంగళ్’ సినిమాతో ఉత్తమ గాయనిగా మొదటి నేషనల్ అవార్డును గెలుచుకున్నారు. ఆ తర్వాత 1979లో ‘శంకరాభరణం’ సినిమాతో రెండో సారి ఉత్తమ గాయనిగా నేషనల్ అవార్డును గెలుచుకున్నారు. ‘స్వాతికిరణం’ సినిమాతో మూడో నేషనల్ అవార్డును గెలుచుకున్నారు. వాణీ జయరాం తెలుగులో దాదాపుగా వెయ్యి పాటలకు పైగా పాడారు. తన గాన ప్రతిభకు గుర్తింపుగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ గాయనికి పద్మభూషణ్ అవార్డు పురస్కారం ప్రకటించింది. ఇంతలోనే ఆమె కన్నుమూయడం సినీ ఇండస్ట్రీని షాక్ కు గురిచేసింది.