మధురమైన గాత్రం, సంగీతంపై విశేషమైన పట్టున్న గాయకుడిగా పేరు తెచ్చుకున్న బాలసుబ్రహ్మణ్యం గాన గంధర్వుడిగా పేరు తెచ్చుకున్నారు. ఏ నటుడికి తగ్గట్లుగా ఆ నటుడికి గాత్రం మార్చి పాడడం బాలుకే సాధ్యం. దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్లోనూ తన గాత్ర మాధుర్యంతో కోట్లాది ప్రజలను మైమరపించిన బాలసుబ్రహ్మణ్యం సెప్టెంబర్25, 2020న కన్నుమూసిన సంగతి తెలిసిందే.
తెలుగు, తమిళంతోపాటు కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ప్రధానంగా ఆయన పాటలు వినిపిస్తాయి. మొత్తంగా చూస్తే 16కుపైగా భాషల్లో ఆయన పాటలు పాడారు. 40,000కుపైగా పాటలు పాడి ఆయన గిన్నిస్ రికార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఆయన మరణాన్ని సంగీత ప్రపంచం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతుంది. తాజాగా సునీత .. ఆయన మరణించి ఏడాది వస్తున్న సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
‘మావయ్యా .. ఒక్కసారి గతంలోకి నడవాలనుంది. నీ పాట వినాలనుంది. నువ్ పాడుతుంటే మళ్ళీ మళ్ళీ చెమర్చిన కళ్ళతో చప్పట్లు కొట్టాలనుంది. ఇప్పుడు ఏంచెయ్యాలో తెలీని సందిగ్ధంలో నా గొంతు మూగబోతోంది.సంవత్సరం కావొస్తోందంటే నమ్మటం కష్టంగా వుంది. ఎప్పటికీ నువ్వే నా గురువు, ప్రేరణ, ధైర్యం,బలం,నమ్మకం. ఎక్కడున్నా మమ్మల్నందర్నీ అంతే ఆప్యాయతతో చుస్కుంటున్నావన్న నమ్మకముంది. ఆ నమ్మకంతోనే నేను కూడా ..బతికేస్తున్నా’.. అంటూ ఇన్స్టాగ్రామ్లో భావోద్వేగ పోస్ట్ను పంచుకున్నారు.