సంగీత దర్శకురాలిగా పాతికేండ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది ఎంఎం శ్రీలేఖ. 5 భాషల్లో దాదాపు 80 చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఏకైక మహిళా సంగీత దర్శకురాలిగా ఖ్యాతి పొందింది. ఈ సందర్భంగా ఆమె ఈ నెల 17వ తేదీ నుంచి ప్రపంచ సంగీత పర్యటనకు వెళ్తున్నది. 25 దేశాల్లో ఈ మ్యూజిక్ టూర్ సాగనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిలింనగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంఎం శ్రీలేఖ మాట్లాడుతూ…‘నా మ్యుజీషియన్స్, సింగర్స్, ఆర్టిస్టుల సహకారంతో పాతికేండ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నాను. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాను. పారితోషికాల కోసం కాకుండా సంతృప్తి కోసమే పనిచేశాను. నేను చేయబోతున్న వరల్డ్ టూర్ను ఆదరిస్తారని కోరుకుంటున్నా’ అని చెప్పింది.