‘భార్యలు తమను నిర్లక్ష్యం చేస్తున్నారనే భావనలో ఉన్న యాభై ఏళ్ల వయసున్న ముగ్గురు వ్యక్తుల కథ ఇది. ఓ ప్రముఖ గాయని పట్ల ఆకర్షితులైన వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయన్నది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది’ అని అన్నారు ప్రముఖ గాయకుడు మనో. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘క్రేజీ అంకుల్స్’. ఇ.సత్తిబాబు దర్శకుడు. గురువారం ప్రేక్షకులముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్లో మనో పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ నటుడిగా నేను గ్యాప్ తీసుకోలేదు. అనుకోకుండా వచ్చింది. మంచి కాన్సెప్ట్తో రూపొందిన ఈ చిత్రం ద్వారా సుదీర్ఘ విరామం తర్వాత కెమెరా ముందుకు రావడం ఆనందంగా ఉంది. మనసుకు ఆనందాన్ని పంచే చిత్రమిది.
ఇందులో నేను బంగారం షాపు ఓనర్గా నటించా. నిజజీవితంలో నేను చాలా జోవియల్గా ఉంటూ చుట్టుపక్కల వారందరినీ నవ్విస్తుంటాను. అలాంటి పాత్రను ఈ సినిమాలో చేశాను. నవ్విస్తూనే ఆలోచింపజేస్తుంది. నేపథ్య గాయకుడిగా ఇప్పటివరకు పదమూడు భాషల్లో 25వేలకుపైగా పాటలు పాడాను. ప్రస్తుతం ట్రెండ్ మారడంతో గాయకుడిగా నా స్పీడు తగ్గింది. గతంలో మద్రాస్లో సినీ పరిశ్రమ కేంద్రీకృతమై ఉండటంతో అందరికీ అవకాశాలొచ్చాయి. ఇప్పుడు ఇండస్ట్రీ అన్ని రాష్ర్టాల్లో విస్తరించడం, సామాజిక మాధ్యమాల కారణంగా పోటీ పెరిగింది. ఇంతకుముందు ఇండస్ట్రీలో నిర్మాతల మధ్య చక్కటి సంబంధాలుండేవి. ఇప్పుడా పరిస్థితులు కనిపించడం లేదు. ప్రస్తుతం యూట్యూబ్ కారణంగా ప్రతి ఒక్కరూ గాయకులుగా తక్కువ వ్యవధిలోనే పాపులర్ అవుతున్నారు.
కానీ అలా వచ్చే పేరుప్రఖ్యాతులు శాశ్వతం కాదు. క్రమశిక్షణ, చక్కటి ప్రవర్తన కలిగి ఉండటంతో పాటు సాధన చేయడం ముఖ్యం. అప్పుడే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలదొక్కుకుంటారు. భవిష్యత్తులో కామెడీ ప్రధానంగా సాగే మరిన్ని మంచి పాత్రలు చేయాలనుంది. ప్రస్తుతం రెండు, మూడు సినిమాల్లో అవకాశాలొచ్చాయి. ఈ సినిమా ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని వాటిపై ఓ నిర్ణయానికి వస్తాను’ అని తెలిపారు.