94ఏండ్ల వయసులో ప్రఖ్యాత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన విభిన్న కథా చిత్రం ‘సింగ్ గీతం’. భారతదేశపు తొలి మ్యూజికల్ ఫాంటసీగా రూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సమర్పణలో, స్వప్న సినిమా పతాకంపై నాగ్అశ్విన్ నిర్మించారు. ఒక దిగ్గజ దర్శకుడు, ఒక లెజెండరీ నిర్మాణ సంస్థ కలిసి రూపొందించిన ఈ చిత్రం ద్వారా అయాన్, అహల్య బమ్రూ, శాలిని కొండేపూడి ప్రధాన పాత్రధారులుగా పరిచయం అవుతున్నారు.
జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఆదివారం వైజాగ్లో ఈ సినిమాకు చెందిన ప్రత్యేక ఈవెంట్ని మేకర్స్ నిర్వహించారు. దేశంలో ఇప్పటివరకూ రాని కాన్సెప్ట్తో ఈ సినిమా రూపొందిందని, ఇంత గొప్ప సినిమాకు హీరోను కావడం తన అదృష్టమని హీరో అయాన్ అన్నారు. ఈ సినిమాలో భాగం కావడం పట్ల అహల్య బమ్రూ, శాలినీ కొండేపూడి ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సంగీతం అందించిన దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ ‘సింగీతం సినిమాకు సంగీతం అందించడం నా అదృష్టం. అరుదుగా వచ్చే అవకాశం ఇది. ఇది కంప్లీట్ మ్యూజికల్ ఫిల్మ్. అంతా మనసుపెట్టి పనిచేశాం. సింగీతంగారికోసమైనా ఈ సినిమా తప్పక అంతా చూడాలి’ అని పేర్కొన్నారు.