లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘సింగ్ గీతం’. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండేపూడి ప్రధాన పాత్రధారులు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా పతాకాలపై ప్రముఖ దర్శకుడు నాగ్అశ్విన్ నిర్మిస్తున్నారు. జూన్ 11న ప్రేక్షకుల ముందుకురానుంది. శనివారం ఈ చిత్రం నుంచి ‘హలో బాసు’ అనే పాటను విడుదల చేశారు.
దేవిశ్రీప్రసాద్ స్వరపరచిన ఈ పాటను వంశీ, ఆర్పీ, కృష్ణాంగ్ ఆలపించారు. ఈ సందర్భంగా నాగ్అశ్విన్ మాట్లాడుతూ ‘ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. నేను నిర్మించిన ‘జాతి రత్నాలు’ తరహాలోనే ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ‘హలో బాసు’ పాటలో చాలా ఫన్ ఉంటుంది’ అన్నారు. ఈ సినిమాలో తాను దాసు అనే పాత్రను పోషించానని నటుడు వంశీ తెలిపారు. సంగీత ప్రధానంగా మ్యాజిక్ రియలిజమ్, ఫాంటసీ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.