‘ నేను చూసిన అనుభవాల నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనే టిల్లు పాత్ర. టిల్లుకీ నాకూ ఒకటే తేడా. వాడు తన మనసులోవన్నీ బయటకు అంటాడు. నేను మనసులో అనుకుంటాను.’ అంటున్నారు యువహీరో సిద్ధు జొన్నలగడ్డ. ఆయన కథానాయకుడిగా మల్లిక్రామ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘టిల్లు స్వేర్’. ఈ సినిమాకు కథనం, మాటలు కూడా సిద్ధు జొన్నలగడ్డే అందించారు. అనుపమా పరమేశ్వరన్ కథానాయిక. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల అవుతున్నది. ఈ సందర్భంగా సిద్ధు విలేకరులతో ముచ్చటించారు.
‘డీజే టిల్లు’ సమయంలో టిల్లు కేరక్టర్పై ప్రేక్షకుల్లో అంచనాలు లేవు. సినిమా చూసి సర్ప్రైజ్ అయ్యారు. ఇప్పుడు టిల్లు మరోసారి వస్తున్నాడంటే అంచనాలు పీక్స్లో ఉంటాయి. అందుకే కాస్త ఒత్తిడి ఎక్కువగానే ఉంది. ఆ ఒత్తిడిని అధిగమించి మెరుగైన అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేశాం. ‘డీజే టిల్లు’ కథ, పాత్ర.. రెండూ కొనసాగింపుగా ‘టిల్లు స్కేర్’ ఉంటుంది. పాత కథను గుర్తు చేస్తూ కొత్త అనుభూతినిచ్చే సినిమా ఇది. ‘టిల్లు’ కూడా ఇందులో ఫస్ట్ పార్ట్కంటే ఎనర్జిటిక్గా ఉంటాడు. ఇందులో ఇంకా పెద్ద సమస్యలో ఇరుక్కుంటా డు. సినిమా అంతా సర్ప్రైజులు, షాక్లే. తెరపై టిల్లు అస్సలు నవ్వడు. ప్రేక్షకులు మాత్రం పొట్టచెక్కలయ్యేలా నవ్వుతూనే ఉంటారు. సినిమా కూడా ఎక్కువ నిడివి ఉండదు. సినిమాకు ఎంత అవసరమో అంతే ఉంటుంది. ఎక్కడా బోర్ కొట్టదు.
అనుపమ పాత్ర ఇందులో చాలా బావుంటుంది. తొలిపార్ట్లో హీరోయిన్కి ఎంత ప్రాముఖ్యత ఉందో ఇందులో అనుపమ పోషించిన లిల్లీ పాత్రకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. దర్శకుడు మల్లిక్రామ్ అద్భుతంగా మలిచాడు. మా కలయికలో టిల్లూ సీక్వెల్ రావడం చాలా ఆనందంగా ఉంది. త్రివిక్రమ్గారు కథ విషయంలో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. బాగా రావడానికి కొన్ని సలహాలు ఇచ్చేవారు. టిల్లు-3 కూడా ఐడియా ఉందికానీ, ముందు ఓ విభిన్నమైన కథ రాసే పనిలో ఉన్నాను. అది చేశాక టిల్లు-3 గురించి ఆలోచిస్తా.
ఈ సినిమాకు మాటలు రాయడం గొప్ప అనుభవం. ముఖ్యంగా నా పాత్రకు నేనే డైలాగులు రాసుకోవడం నటుడిగా నాకు బాగా కలిసొచ్చింది. ఆ డైలాగులు నా మెదడు నుండి పుట్టాయి కాబట్టి, ఏ ఉద్దేశంతో రాశానో నాకు తెలుసు కాబట్టి, విత్ ఎక్స్ప్రెషన్తో డైలాగ్ పలకడం తేలికైపోయింది. అలాగే ఇందులో సంగీతం కూడా హైలైట్. డీజే టిల్లుకి థమన్ నేపథ్య సంగీతం ఎంత ప్లస్ అయ్యిందో, ‘టిల్లు స్కేర్’కి భీమ్స్ సంగీతం అంత ప్లస్ అవుతుంది.