‘నాకు సినిమాలు తప్ప వేరే విషయాలు తెలియదు. నటన ద్వారానే అనుకున్నది సాధించాలనుకున్నా. ఈ సినిమా విజయంతో నా పన్నెండేళ్ల కల నిజమైంది’ అన్నారు సిద్ధు జొన్నలగడ్డ. ఆయన కథానాయకుడిగా విమల్కృష్ణ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘డీజే టిల్లు’ చిత్రం ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చిన విషయం తెలిసిందే. బుధవారం ఏపీలోని విశాఖపట్నంలో విజయోత్సవ వేడుకల్ని నిర్వహించారు. సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ ‘నేను చేసిన సినిమాల్లో ‘డీజే టిల్లు’ బ్లాక్బస్టర్ అంటున్నారు. మా తలరాత మేమే రాసుకోవాలనే సంకల్పంతో ఈ సినిమా కోసం శ్రమించాం. నేడు మా కష్టానికి ప్రతిఫలం లభించింది’ అన్నారు. తమ సంస్థకు మరో భారీ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు నిర్మాత నాగవంశీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సినిమా విజయంతో ప్రేక్షకులు తమకు కొత్త జీవితాన్నిచ్చారని దర్శకుడు విమల్కృష్ణ చెప్పారు. రాధిక పాత్రలో తనను ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారని కథానాయిక నేహాశెట్టి తెలిపింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులకు జ్ఞాపికల్ని అందజేశారు.