‘తెలుగు ప్రేక్షకులు నన్ను స్టార్ను చేశారు. తెలుగు నటుడిని అని చెప్పుకోవడానికి గర్వపడుతుంటాను. టాలీవుడ్కు ఎప్పటికీ దూరంకాను.’ అని అన్నారు సిద్ధార్థ్. ‘బొమ్మరిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ లాంటి ప్రేమకథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారాయన. కొంత విరామం తర్వాత తెలుగులో సిద్ధార్థ్ నటిస్తున్న చిత్రం ‘మహాసముద్రం’. అజయ్ భూపతి దర్శకుడు. శర్వానంద్ మరో హీరోగా నటిస్తున్నారు. ఈ నెల 14న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో సిద్ధార్థ్ పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి…
‘మహాసముద్రం’ పతాక ఘట్టాల చిత్రీకరణలో యాక్షన్ ఎపిసోడ్ చేస్తున్నప్పుడు చిన్న దెబ్బ తగిలింది. ఆ గాయానికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి లండన్కు వెళ్లాను. అంతేతప్ప నాకు ఎలాంటి సర్జరీ జరగలేదు. దర్శకుడు అజయ్భూపతితో ఏర్పడిన కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వెన్నెముక సర్జరీ జరిగినట్లు వార్తలొచ్చాయి. అతడు చేసిన ప్రకటన వల్ల అందరూ అదే నిజమనుకున్నారు. అందులో ఎలాంటి వాస్తవం లేదు. ఈ పుకార్ల వల్ల మా కుటుంబసభ్యులు భయపడిపోయారు.
అరుదుగా ఇలాంటి మంచి కథలు దొరకుతాయి. తెలుగులో పునరాగమనం కోసం నాలుగైదేళ్లుగా చాలా కథలు విన్నా. ఈ క్రమంలోనే అజయ్భూపతి చెప్పిన కథ నాలో ఉత్సుకతను రేకెత్తించింది. సింగిల్ సిట్టింగ్లోనే సినిమాకు ఓకే చెప్పాను. 1980-90 కాలం నాటి యాక్షన్, ఎమోషనల్ డ్రామా సినిమాల శైలిలో సాగుతుంది. ట్రెండ్సెట్టర్గా నిలిచిపోయే పక్కా మల్టీస్టారర్ సినిమా ఇది. నటుడిగా ఇప్పటివరకు కనిపించనటువంటి కొత్త పాత్రను ఈ సినిమాలో చేశా. రెండు టైమ్ పీరియడ్స్లో ఈ కథ సాగుతుంది.
మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయనే పాయింట్తో దర్శకుడు అజయ్భూపతి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో హీరో ఎవరు? విలన్గా ఎవరు కనిపిస్తారన్నది తెరపై ఆసక్తికరంగా ఉంటుంది. నాతో పాటు శర్వానంద్ పాత్ర చిత్రణలోనూ నెగెటివ్ షేడ్స్ కనిపించవు. క్యారెక్టర్స్ చాలా రియలిస్టిక్గా ఉంటాయి. అంతర్లీనంగా వచ్చే ప్రేమకథలు అలరిస్తాయి.
పదిహేనేళ్ల క్రితం నా సినీ ప్రయాణం ఆరంభమైంది. తెలుగు సినిమాలు లవర్బాయ్గా, పక్కింటికుర్రాడిగా నాకు చక్కటి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆ ఇమేజ్లను బ్రేక్ చేసే సినిమా అవుతుంది. ‘బాయ్స్’ సినిమాలో ఎలా ఉన్నానో అదే వ్యక్తిత్వం ఇప్పటికీ నాలో కనిపిస్తుంది. నేను మారలేదు. స్వీయవిశ్లేషణ చేసుకునే క్రమంలో నాకు నేనుగానే సినిమాలకు గ్యాప్ తీసుకున్నా. ఇకపై విరామం తీసుకోకుండా వరుసగా సినిమాలు చేస్తాను ‘మహాసముద్రం’ ఖచ్చితంగా నాకు మంచి కమ్బ్యాక్ సినిమా అవుతుంది.
పదేళ్ల నుంచి శర్వానంద్తో పరిచయం ఉంది. తొలినాళల్లో అతను ఏ సినిమా ఆడుతుంది?ఎలాంటి కథను ఎంచుకోవాలని అంటూ చాలా ప్రశ్నలు అడుగుతుండేవాడు. ఇప్పుడు నటుడిగా అతడిలో చక్కటి పరిణతి వచ్చింది. సామాజిక ఇతివృత్తాలతో సినిమాలు చేస్తూ హీరోగా తనకంటూ చక్కటి అభిమానగణాన్ని ఏర్పరచుకున్నాడు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో నాకు జీవితకాల సభ్యత్వముంది. ఈ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నాను. ఎన్నికల నేపథ్యంలో తెలుగు చిత్రసీమలో జరుగుతున్న పరిణామాల్ని గమనిస్తున్నా. నా మనసుకు ఎవరూ సరైన నాయకుడు అనిపిస్తే వారికే ఓటువేస్తాను. ఎప్పుడూ నిజాలే మాట్లాడాలి, నిజాయితీగా ఉండాలనే సిద్ధాంతాన్ని విశ్వసిస్తా. దాని వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురైన ధైర్యంగా స్వీకరిస్తా. రాజకీయాల్లో రావాలా?వద్దా? అన్నది ఇంకా నిర్ణయించుకోలేదు. వచ్చే అవకాశాలు తక్కువే ఉన్నాయి. ప్రస్తుతం తెలుగులో కొత్త సినిమాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి.