గత ఏడాది చివర్లో ‘చిన్నా’గా పలకరించి నటుడిగా ప్రశంసలందుకున్నారు హీరో సిద్ధార్థ్. ఆయన తాజా చిత్రానికి ఇప్పుడు రంగం సిద్ధమైంది. ‘సిద్ధార్థ్ 40’ వర్కింగ్ టైటిల్తో రూపొందుతోన్న ఈ చిత్రానికి శ్రీగణేశ్ దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో అరుణ్ విశ్వ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి సిద్ధార్థ్ మాట్లాడుతూ ‘ ‘చిన్నా’ సినిమా నటుడిగా నా బాధ్యతను పెంచింది. ఆ సినిమా తర్వాత చాలా కథలు విన్నాను. చివరకు శ్రీగణేశ్ చెప్పిన కథ బాగా నచ్చింది.
ఇదొక యూనివర్సల్ కంటెట్. అంకితభావం, పాషన్ ఉన్న నిర్మాత అరుణ్ విశ్వ. మంచి టీమ్ కుదిరింది. తప్పకుండా మంచి సినిమా ఇస్తాం’ అన్నారు. ఈ కథకు పరిణతి గల నటుడే అవసరం కనుక సిద్ధార్థ్ని కలిశామని, అభిరుచి ఉన్న నిర్మాతతో కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందని దర్శకుడు చెప్పారు. భాష, సరిహద్దులకు అతీతమైన కథ ఇది. అన్ని వయసులవారికీ నచ్చే అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ కథకు సిద్ధార్థ్ ప్రధానబలం. శాంతి టాకీస్ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో అనౌన్స్ చేస్తాం.’ అని నిర్మాత అరుణ్విశ్వ తెలిపారు.